ఫిన్లాండ్లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు
- ఫిన్లాండ్లో 45 రోజులుగా కనిపించని హైదరాబాద్ విద్యార్థి మణిదీప్ రెడ్డి
- కొడుకు ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
- కేంద్ర ప్రభుత్వం, ఎంబసీ వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులు
- మే 5న తల్లితో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్
- ఫిన్లాండ్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపిన కేంద్రం
మణిదీప్ రెడ్డి 2025 మార్చిలో ఫిన్లాండ్లోని లాహ్టి నగరంలో ఉన్న లూట్ యూనివర్సిటీలో బీటెక్ కోర్సులో చేరాడు. మే 5వ తేదీన అతడు తన తల్లితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. తాను ఒక బేకరీలో ఉన్నానని, రూంకి తిరిగి వెళతానని చెబుతూనే, డబ్బులు కావాలని కోరాడు. అయితే, ఆ తర్వాత నుంచి మణిదీప్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మణిదీప్ ఆచూకీ కోసం అతడి స్నేహితులు, రూమ్మేట్స్, యూనివర్సిటీ అధికారులను సంప్రదించినా ఎటువంటి ఫలితం లభించలేదు. హెల్సింకిలోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు స్పందించడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ మణిదీప్ తల్లిదండ్రులు గుజ్జ మరనాత, ముత్యం రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై జూన్ 18న జస్టిస్ బి. విజయ్సేన్ రెడ్డి విచారణ జరిపారు. కేంద్ర ప్రభుత్వం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ, కేసు దర్యాప్తు పురోగతిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేశారు. ఫిన్లాండ్లో ఇప్పటికే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. తమ కుమారుడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.