మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. ఇరవై ఏళ్ల నాటి హత్య కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయం!
- 2006 నాటి డబుల్ మర్డర్ కేసులో 20న రాబోతున్న తుది తీర్పు
- శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు ఎంపీలను చీల్చేందుకు తెరపైకి ‘ఆపరేషన్ టైగర్’
- కేసులో అనుకూల తీర్పు ఇప్పిస్తామంటూ ఎంపీ ఓంరాజే నింబాళ్కర్పై ప్రత్యర్థి వర్గం ఒత్తిడి!
- లోక్సభ స్పీకర్కు పంపే లేఖపై సంతకం చేయకుండా తిరుగుబాటును ప్రస్తుతానికి అడ్డుకున్న ఓంరాజే
- కోర్టు తీర్పు తర్వాతే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేసిన ఎంపీ
శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులను ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని అధికార శివసేనలో విలీనం చేసేందుకు ‘ఆపరేషన్ టైగర్’ పేరిట ఒక రహస్య ప్రణాళిక జరిగినట్లు తెలుస్తోంది. ఈ తిరుగుబాటుపై శివసేన యూబీటీ ప్రధాన ప్రతినిధి సంజయ్ రౌత్ ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు.
పవన్ రాజే హత్య కేసులో ఇరవై ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న ఓంరాజే నింబాళ్కర్ను కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు సంప్రదించారని రౌత్ పేర్కొన్నారు. ఆయన గనుక ఉద్ధవ్ థాకరే పక్షాన్ని వీడి షిండే వర్గంలో చేరితే, ఈ సుదీర్ఘ కేసులో కోర్టు నుంచి పూర్తి ఉపశమనం లభించేలా చూస్తామని ఒత్తిడి తెచ్చారని, అందుకోసమే మొదట జూన్ 16న రావలసిన తీర్పును 20వ తేదీకి వాయిదా వేయించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా తిరుగుబాటు చేసే ప్రతి ఎంపీకి యాభై కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చారని, అందులో పదిహేను కోట్లు ముందస్తుగా చెల్లించేందుకు సిద్ధమయ్యారని రౌత్ బాంబు పేల్చారు.
అయితే, లోక్సభ స్పీకర్కు సమర్పించాల్సిన తిరుగుబాటు లేఖపై ఓంరాజే నింబాళ్కర్, ముంబై ఎంపీ సంజయ్ దినా పాటిల్ సంతకాలు చేయకపోవడంతో ఈ ‘ఆపరేషన్ టైగర్’ ప్రస్తుతానికి నిలిచిపోయింది. దీనిపై ఓంరాజే నింబాళ్కర్ స్పందిస్తూ, తాము దాదాపు రెండు దశాబ్దాలుగా న్యాయం కోసం వేచి చూస్తున్నామని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఈ కేసులో సూత్రధారులైన మాజీ మంత్రి పద్మసింహ పాటిల్తో కూడిన నిందితులకు ఉరిశిక్ష పడాలన్నదే తమ కుటుంబ డిమాండ్ అని స్పష్టం చేశారు. రాజకీయ ఊహాగానాలపై తానేమీ మాట్లాడనని, కోర్టు తీర్పు వచ్చే జూన్ ఇరవై తర్వాతే తన తదుపరి రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేస్తానని ఆయన ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.