తుప్పు పట్టిన కత్తులతో ఆహారం కట్‌ చేస్తే చర్యలు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు

  • తుప్పు పట్టిన కత్తులు, బ్లేడ్‌లు వాడొద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు
  • ఫుడ్‌ గ్రేడ్‌, తుప్పు నిరోధక పరికరాలే వినియోగించాలని సూచన
  • లేదంటే ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక
  • క్రమం తప్పకుండా శుభ్రపరచడం, శానిటైజేషన్‌ చేయాలని ఆదేశం
  • నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, చట్టపరమైన చర్యలని హెచ్చరిక
ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడమే లక్ష్యంగా భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్లు ఆహార తయారీ, ప్రాసెసింగ్‌, స్లైసింగ్‌, ప్యాకేజింగ్‌ కార్యకలాపాల్లో ఫుడ్‌ గ్రేడ్‌, తుప్పు నిరోధక కత్తులు, బ్లేడ్‌లు, ఇతర సేఫ్‌ కటింగ్‌ పరికరాలను మాత్రమే ఉపయోగించాలని సూచించింది.

కొన్ని ఆహార సంస్థలు తుప్పు పట్టిన, పగుళ్లు ఉన్న, రంగు ఊడిపోయిన లేదా దెబ్బతిన్న కత్తులు, బ్లేడ్‌లు ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. ఇలాంటి పరికరాల వల్ల ఆహారంలో భౌతిక, రసాయన, సూక్ష్మజీవుల కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఆహార భద్రత నిబంధనల ప్రకారం ఫుడ్‌ తయారీలో వాడే పరికరాలు విషపూరితం కాని, తుప్పు పట్టని, నాణ్యమైన పదార్థాలతో తయారై ఉండాలని స్పష్టం చేసింది. కత్తులు, బ్లేడ్‌లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడంతో పాటు వాటిపై తుప్పు, పగుళ్లు, విరిగిన భాగాలు లేకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా శుభ్రపరచడం, శానిటైజేషన్‌, అవసరమైన చోట స్టెరిలైజేషన్‌ చేపట్టాలని పేర్కొంది.

నిబంధనలు పాటించని వ్యాపారులపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ చట్టం-2006 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్లు, ప్రాంతీయ డైరెక్టర్లు తనిఖీల సమయంలో ఈ అంశంపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది.

FSSAI
Food Safety Guidelines
Rusted Knives Food Contamination
Food Business Operators Regulations
Food Safety and Standards Act 2006
Food Grade Cutting Tools

More Telugu News