నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబుకు శశి థరూర్ కౌంటర్.. డ్రైవర్ జీతం ఉదాహరణతో సంచలన పోస్ట్!

  • లోక్‌సభ స్థానాల పునర్విభజన అంశంపై చంద్రబాబు, శశి థరూర్ మధ్య మేధోపరమైన చర్చ
  • అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచినా.. ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాదికే లాభమని థరూర్ వాదన
  • శాతాల వారీగా పెంపు సమానంగా ఉన్నా.. సంఖ్యాపరంగా పెద్ద రాష్ట్రాలకే రాజకీయ పట్టు పెరుగుతుందని హెచ్చరిక
  • గతంలో వాజపేయి హయాంలో దక్షిణాది ప్రయోజనాలను కాపాడానని గుర్తుచేసిన చంద్రబాబు
దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పునర్విభజన విధానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా స్పందించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం లోక్‌సభ స్థానాలను పెంచినప్పటికీ, అది అంతిమంగా ఎక్కువ జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలకే రాజకీయంగా భారీ ప్రయోజనాన్ని చేకూరుస్తుందని శశి థరూర్ వాదించారు. ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో తగినంత మెజారిటీ లేక ఆగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని చంద్రబాబు విమర్శించిన నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలపై శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను పంచుకున్నారు. ‘‘మీ జీతం రెండు లక్షల రూపాయలు, మీ డ్రైవర్ జీతం ఇరవై వేల రూపాయలు అనుకుందాం.. ఇప్పుడు అందరికీ 50 శాతం జీతం పెంచుతున్నట్లు ప్రకటిస్తే, మీ జీతం మూడు లక్షలు, డ్రైవర్ జీతం ముప్పై వేలు అవుతుంది’’ అని పేర్కొన్నారు. 

ఇద్దరికీ పెరిగిన శాతం ఒక్కటే అయినప్పటికీ, ఆర్థికంగా మీరే ఎక్కువ ప్రయోజనం పొందుతారు కదా? అంటూ ప్రశ్నించారు. ఇదే సూత్రాన్ని స్థానాల పునర్విభజనకు అన్వయిస్తూ.. ఒకవేళ స్థానాలు పెంచితే ఉత్తరప్రదేశ్‌లో సీట్ల సంఖ్య 80 నుంచి 120 కి పెరుగుతుందని, అదే కేరళలో 20 నుంచి 30కి మాత్రమే పెరుగుతుందని వివరించారు. దీనివల్ల యూపీకి అదనంగా 40 మంది ఎంపీలు వస్తే, కేరళకు కేవలం 10 మంది మాత్రమే వస్తారని, ఇది రాజకీయ సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

జనాభాను విజయవంతంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు, కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే పార్లమెంట్‌లో తమ ప్రభావాన్ని కోల్పోతాయనేది శశి థరూర్ ప్రధాన ఆందోళన. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రస్తుతమున్న నిష్పత్తిని మార్చకుండానే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచాలనే ప్రతిపాదనను సమర్థించారు. 

ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలంటే ఈ బిల్లు అవసరమని ఆయన స్పష్టం చేశారు. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో దక్షిణాది ప్రయోజనాలను కాపాడటంలో తాను కీలక పాత్ర పోషించానని చంద్రబాబు గుర్తుచేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా రక్షణ కల్పించే స్పష్టమైన నిబంధనలను బిల్లులో చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 

Shashi Tharoor
Chandrababu Naidu
Delimitation of constituencies
Lok Sabha seats
South Indian states
Women Reservation Bill

More Telugu News