సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. ఫ్యాన్ పేజీపై గంగూలీ పోలీస్ కంప్లైంట్
- తనపై దుష్ప్రచారం చేస్తున్న ఫేస్బుక్ పేజీపై గంగూలీ ఫిర్యాదు
- ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపణ
- ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగాయని తప్పుడు ప్రచారం చేశారని వెల్లడి
- పేజీ నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి
'సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్' పేరిట నిర్వహిస్తున్న ఓ అనధికారిక పేజీ తనపై నిరంతరం తప్పుడు కథనాలను పోస్ట్ చేస్తోందని గంగూలీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సుమారు 36 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఈ పేజీలో.. తన నివాసంలో ఈడీ సోదాలు జరిగాయంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని వివరించాడు.
బహిరంగ జీవితంలో ఉన్న వ్యక్తులపై విమర్శలు రావడం సహజమే అయినప్పటికీ, కావాలనే తన వ్యక్తిగత, వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని గంగూలీ స్పష్టం చేశాడు. సదరు ఫేస్బుక్ పేజీ నిర్వాహకులను గుర్తించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.
గంగూలీ నుంచి ఫిర్యాదు అందిన విషయాన్ని కోల్కతా పోలీసులు ధ్రువీకరించారు. దీనిపై ప్రాథమిక విచారణ ప్రారంభించామని, సైబర్ చట్టాల కింద కేసు దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.