కాంగ్రెస్ వైఖరిపై బండి సంజయ్ నిప్పులు.. తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడి

  • తెలంగాణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బండి సంజయ్
  • అక్రమ వలసదారుల ఓట్లపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న
  • తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని వ్యాఖ్య

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రసక్తే లేదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


దేశంలోకి అక్రమంగా చొరబడిన వలసదారుల గురించి కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అక్రమ వలసదారులతో ఇక్కడి ముస్లిం సమాజాన్ని పోల్చడం ద్వారా కాంగ్రెస్ వారిని అవమానిస్తోందని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


గత పన్నెండేళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్రం ఏకంగా రూ. 10 లక్షల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల అభివృద్ధికి వేల కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రం వేగంగా దూసుకుపోవాలంటే 'డబుల్ ఇంజన్ సర్కార్' రావాలని, ఈసారి ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వాలని ప్రజలను కోరారు.


మావోయిస్టుల గురించి మాట్లాడుతూ... సమాజంలో తుపాకీ సంస్కృతి, మారణహోమంతో సాధించేది ఏమీ లేదన్నారు. ఏమీ తెలియని మైనర్ పిల్లల చేత తుపాకులు పట్టించడం అత్యంత దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది మావోలు లొంగిపోయారని, ఇంకా ఆ ఆలోచనల్లో ఉన్నవారు భవిష్యత్తు కోసం మారాలని పిలుపునిచ్చారు.


Bandi Sanjay
Telangana Development
Congress Party
BJP Telangana
Narendra Modi
Central Funds for Telangana

More Telugu News