అల్లుడి ‘ధురంధర్’ సినిమాపై ప్రకాశ్ పదుకొణె ప్రశంసలు.. కానీ ఆ ఒక్క విషయంలోనే అసంతృప్తి!

Prakash Padukone praises son-in-law Ranveer Singh movie Dhurandhar but unhappy with violence
  • సినిమా బాగున్నా హింస కాస్త ఎక్కువైందన్న ప్ర‌కాశ్ పదుకొణె
  • రణ్‌వీర్‌తో తమ కుటుంబానికి బలమైన బంధం ఉందని వెల్లడి
  • క్రీడల గురించి తాము ఎక్కువగా మాట్లాడుకుంటామని వెల్లడి
  • సోషల్ మీడియాకు తాను పూర్తిగా దూరంగా ఉంటానని స్పష్టీక‌ర‌ణ‌
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌తో తన బంధం, ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం గురించి భారత మాజీ బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల రణ్‌వీర్ నటించిన ‘ధురంధర్’ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే, సోషల్ మీడియాకు తాను ఎందుకు దూరంగా ఉంటానో కూడా వివరించారు. ఒక మీడియా పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అల్లుడు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా గురించి ప్రకాశ్ పదుకొణె మాట్లాడుతూ.. "అది ఒక గొప్ప చిత్రం. అందరి నటనతో చాలా బాగా తీశారు. అయితే, సినిమాలో హింస కాస్త ఎక్కువైందని మాకు అనిపించింది. కానీ, మెజారిటీ ప్రేక్షకులు సినిమాను ఇష్టపడ్డారు. కాబట్టి అదే ముఖ్యం అనుకుంటున్నాను" అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. సినిమాపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, అది ప్రేక్షకులను మెప్పించిందని ఆయన పేర్కొన్నారు.

రణ్‌వీర్‌తో తన అనుబంధం గురించి వివరిస్తూ.. ఇరు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయని ప్రకాశ్ పదుకొణె తెలిపారు. "మేము కలిసి చాలా సమయం గడుపుతాం. నిజానికి, రెండు కుటుంబాలు చాలా క్లోజ్. ప్రతీ ఏడాది కనీసం ఒకసారైనా మేమంతా కలిసి వెకేషన్‌కు వెళ్తాం" అని ఆయన వెల్లడించారు. బిజీ షెడ్యూల్స్ కారణంగా కలిసే సమయం తక్కువగా ఉన్నప్పటికీ, దొరికిన సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తామని అన్నారు.

తమ మధ్య క్రీడలు ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా ఉంటాయని పదుకొణె తెలిపారు. "మా ఇద్దరి మధ్య చాలా కామన్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. రణ్‌వీర్‌కు స్పోర్ట్స్ అంటే చాలా ఆసక్తి. నాతో క్రీడల గురించి మాట్లాడుతుంటాడు. అలాగే, నాకు సినిమాల బిజినెస్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి, నేను తనని సినిమాల గురించి అడుగుతుంటాను. ఫుట్‌బాల్, క్రికెట్ వంటివి కలిసి చూస్తూ ఆనందిస్తాం. రణ్‌వీర్ 'ఆర్సెనల్' ఫ్యాన్ అయితే, మా చిన్నమ్మాయి అనీషా 'మాంచెస్టర్ యునైటెడ్' అభిమాని. ఇలా మా మధ్య సరదా సంభాషణలు జరుగుతుంటాయి" అని వివరించారు.

సోషల్ మీడియా వినియోగంపై మాట్లాడుతూ, తాను దానికి పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకాశ్ పదుకొణె స్పష్టం చేశారు. "నాకు విషయాలన్నీ నా కూతుళ్ల ద్వారానే తెలుస్తాయి. నేను సోషల్ మీడియాకు పూర్తిగా దూరం. దానివల్ల మనకు తెలియకుండానే అనవసరంగా సమయం వృథా అవుతుంది. అందుకే అది నాకు వద్దు" అని స్పష్టం చేశారు.

కాగా, గతేడాది డిసెంబర్ 5న 'ధురంధర్' థియేటర్లలో విడుదల కాగా, ఈ ఏడాది మార్చి 19న దాని సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Go Back to Shorts
Prakash Padukone
Ranveer Singh
Dhurandhar Movie
Bollywood News
Prakash Padukone Interview
Dhurandhar Film Review

More Telugu News