జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్

  • పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పవన్ కీలక నిర్ణయం
  • 14 మంది సభ్యులతో 'జాయినింగ్స్ కమిటీ' ఏర్పాటు
  • విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యం
జనసేన పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించే దిశగా కీలక ప్రకటన చేశారు. 14 మంది సభ్యులతో కూడిన ‘జాయినింగ్స్ కమిటీ’ని ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ కమిటీలో జనసేన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలకు స్థానం కల్పించారు. ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇతర సభ్యులుగా పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, డా. హరిప్రసాద్, డా. పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టి.సి. వరుణ్, ఆరణి మదన్‌లను నియమించారు.

పవన్ తన ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం ఈ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, చేరికల విధానాలు, విధివిధానాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్‌లోని చేరికలను పర్యవేక్షిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, ఏపీ తరహాలోనే త్వరలో తెలంగాణలో కూడా ప్రత్యేక ‘జాయినింగ్స్ కమిటీ’ని ఏర్పాటు చేసేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది.

Pawan Kalyan
Jana Sena Party
Joinings Committee
Andhra Pradesh Politics
Deputy CM Pawan Kalyan
Jana Sena New Members

More Telugu News