అడవిలో అన్నలపై కవిత కీలక వ్యాఖ్యలు

Kalvakuntla Kavitha key comments on Maoists in forest
  • 'బాయి బాట' కార్యక్రమంలో భాగంగా కవితకు అడ్డంకులు
  • మంచిర్యాల ఆర్కే-7 గని వద్ద కవితను నిలువరించిన పోలీసులు
  • ఆంక్షలను ఛేదించుకుని కార్మికులతో మాట్లాడిన ఎమ్మెల్సీ
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు
టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మావోయిస్టుల ఉనికిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అడవుల్లో మావోయిస్టులు ఉన్న సమయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించేవారని, ప్రస్తుతం వారు లేకపోవడంతో అధికారుల ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆమె పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఆమె చేపట్టిన ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

తన వారం రోజుల పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని ఆర్కే-7 గని వద్దకు చేరుకున్న కవితను పోలీసులు, సింగరేణి భద్రతా సిబ్బంది గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. చివరకు ఆమె ఆంక్షలను అధిగమించి ముందుకు సాగి, కార్మికులతో సమావేశమయ్యారు.

మందమర్రిలోని కాసిపేట-1 గని నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కవిత, పర్యటనలో రెండో రోజైన సోమవారం ఈ ఘటనను ఎదుర్కొన్నారు. గేట్ మీటింగ్ నిర్వహించకుండా అధికారులు అడ్డుకోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. గతంలో కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి ప్రాంతానికి వచ్చినప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆమె ఆరోపించారు.

కార్మికుల హక్కులను కాలరాస్తే టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని కవిత హెచ్చరించారు. కార్మికుల సంక్షేమం, ఉపాధి సమస్యలు, ఓపెన్‌కాస్ట్ గనుల విస్తరణ వంటి అంశాలపై నేరుగా కార్మికులతో చర్చించేందుకే తాము ‘బాయి బాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.                                
Go Back to Shorts
Kalvakuntla Kavitha
Singareni Workers
BRS Party
Maoists
Mancherial
Baayi Baata

More Telugu News