అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ

  • రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పలు సంస్థల ప్రతినిధులతో భేటీలు
  • అమరావతి నిర్మాణ ప్రణాళికపై సుర్బానా జురాంగ్ సంస్థతో చర్చలు
  • సింగపూర్ ఉప ప్రధాని, మంత్రులతో స‌మావేశం కానున్న సీఎం
  • వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రెండో రోజు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఆయన పలు కీలక కార్యక్రమాలు, ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొంటున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ సిటీస్' సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నగరాల అభివృద్ధి, ఆధునిక ప్రణాళికలపై ఈ సదస్సులో చర్చిస్తారు.

అలాగే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో జరిగే పార్టనర్‌షిప్ సమ్మిట్-2026 బిజినెస్ రోడ్ షోకు కూడా ముఖ్యమంత్రి హాజరవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం ఈ రోడ్ షో ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ఆయన వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై చర్చిస్తారు. ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ సెమికాన్ ఎకోసిస్టమ్‌పై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజధాని అమరావతి అభివృద్ధి ప్రణాళికపై ఈ పర్యటనలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో సీఆర్‌డీఏ అధికారులు సమావేశమై భూ వినియోగం, నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. సీఎం చంద్రబాబు సైతం సుర్బానా జురాంగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, నిపుణులతో భేటీ అయి పట్టణాభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించనున్నారు.

మధ్యాహ్నం సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి గాన్ సియో హువాంగ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఆయన భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో అమరావతి నిర్మాణానికి సహకారం, రాష్ట్రంలో పెట్టుబడులు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ‘సీబీఎన్@361’ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. ఈ కీలక సమావేశాలన్నీ ముగించుకుని ముఖ్యమంత్రి ఇవాళ రాత్రికే సింగపూర్ నుంచి తిరుగు ప్రయాణమై స్వదేశానికి చేరుకుంటారు.

Chandrababu Naidu
Amaravati
Singapore Visit
World Cities Summit
Andhra Pradesh Investments
Surbana Jurong

More Telugu News