మద్యం ప్రియులకు సుప్రీంకోర్టు షాక్.. ఆ ప్యాకెట్లపై త్వరలోనే పూర్తి బ్యాన్?
- మద్యం ప్యాకింగ్లపై సుప్రీంకోర్టు సీరియస్
- టెట్రా ప్యాక్ల నిషేధానికి పిటిషన్
- కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు జారీ
- తాగి నడపడం వల్లే ప్రమాదాలు
- యువతను ఆకర్షిస్తున్న కొత్త బ్రాండ్లు
'కమ్యూనిటీ అగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్'(CADD) సంస్థ ప్రతినిధి ప్రిన్స్ సింఘాల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెట్రా ప్యాక్లలో వచ్చే ‘గ్రీన్ ఆపిల్ వోడ్కా’ వంటి ఆల్కహాల్ ఉత్పత్తులు చూసేందుకు సాధారణ పండ్ల రసాల (Juice) ప్యాకెట్లలా ఉంటూ ప్రజలను, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి చిన్నగా ఉండటం వల్ల కదులుతున్న వాహనాల్లో కూడా ఎవరికీ అనుమానం రాకుండా దొంగచాటుగా మద్యం సేవించడానికి, తద్వారా ప్రమాదాలు జరగడానికి కారణమవుతున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఏటా లక్షన్నర మంది బలి
భారతదేశంలో ప్రతి సంవత్సరం 6 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, దాదాపు 1.5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న యువతే ఎక్కువగా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఈ చిన్న టెట్రా ప్యాక్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయని, ఇవి మైనర్లకు (Underage) సులభంగా దొరుకుతున్నాయని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ఆరోగ్యం, భద్రతపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండటం లేదని పిల్లో పేర్కొన్నారు.
అతివేగం తర్వాత దేశంలో అత్యధిక మరణాలకు కారణం తాగి నడపడమేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నకిలీ లేదా భ్రమ కలిగించే ప్యాకింగ్ల స్థానంలో కేవలం సులభంగా గుర్తించదగిన సీసాలు (Containers) మాత్రమే వాడేలా జాతీయ విధానాన్ని తీసుకురావాలని, పెద్ద హెల్త్ వార్నింగ్లను ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు.