భారత అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రం.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్
- లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
- ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం
- పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణి రూపకల్పన
- భారత సుదూర లక్ష్య ఛేదన సామర్థ్యం పెరిగిందని వెల్లడి
- డీఆర్డీఓ బృందాన్ని అభినందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఈ ప్రయోగం నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తిగా చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా క్షిపణి గమనాన్ని పర్యవేక్షించినట్లు పేర్కొంది. ఈ విజయంతో సుదూర లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే భారత సామర్థ్యం మరింత పెరిగినట్లయింది.
రక్షణ కార్యదర్శి, డీఆర్డీఓ ఛైర్మన్ రాజేష్ కుమార్ సింగ్తో పాటు భారత నౌకాదళం, వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. LRLACM క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ బృందాన్ని, పరిశ్రమ భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.
డీఆర్డీఓ ప్రయోగశాలలు, భారత పరిశ్రమ భాగస్వాములతో కలిసి ఈ క్షిపణిలోని అన్ని ఉపవ్యవస్థలను దేశీయంగానే అభివృద్ధి చేశాయి. బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADE) నోడల్ లేబొరేటరీగా వ్యవహరించింది. ఈ విజయం 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో కీలక ముందడుగు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండు రోజుల క్రితమే డీఆర్డీఓ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (BMD), యాంటీ-షిప్ క్షిపణులను వరుసగా పరీక్షించిన విషయం తెలిసిందే.