మా ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేశారు... కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం
- సోషల్ మీడియాలో కనిపించని వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజీ
- చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు
- ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ చర్యలన్న జగన్
- పేజీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్
- న్యాయపరంగా పోరాడతామని స్పష్టీకరణ
ఈ ఏడాది ప్రారంభంలో తమ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని, ఇప్పుడు ఫేస్బుక్ పేజీని లక్ష్యంగా చేసుకున్నారని జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. "ఇది కేవలం వైసీపీపై జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడి" అని ఆయన పేర్కొన్నారు. ఇలా ప్రతిపక్ష పార్టీ అధికారిక ఖాతాలను నిలిపివేయడం ప్రమాదకరమని, ఇది పూర్తిగా అప్రజాస్వామికమని అన్నారు.
అమరావతి రాజధాని ఖర్చులు, డీఎస్సీ ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లు వంటి అంశాలపై ఆధారాలతో సహా అవినీతిని బయటపెడుతుండటంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలపై న్యాయపరంగా, రాజ్యాంగబద్ధంగా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. బెదిరింపులు, సెన్సార్షిప్తో తమ గొంతును అణచివేయలేరని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు, తమ ఫేస్బుక్ పేజీని తక్షణమే పునరుద్ధరించాలని జగన్ డిమాండ్ చేశారు.