భారత్‌ అరుదైన ఘనత.. ఖండాంతర క్షిపణులనూ అడ్డుకునే సామర్థ్యం!

  • ఐసీబీఎం స్థాయి ముప్పును అడ్డుకునే సామర్థ్యం భారత్‌ సొంతం
  • వరుసగా మూడు BMD ఫ్లైట్‌ టెస్టులు సక్సెస్‌
  • ఈ సామర్థ్యం ఉన్న అతికొన్ని దేశాల జాబితాలో భారత్‌
  • నేవల్‌ యాంటీ-షిప్‌ మిసైల్‌ తొలి పరీక్ష విజయవంతం 
రక్షణ రంగంలో భారత్‌ మరో కీలక మైలురాయిని చేరుకుంది. దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసే సామర్థ్యాన్ని డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించింది. సముద్రంలో శత్రు నౌకలను లక్ష్యంగా చేసుకొనే కొత్త క్షిపణి సామర్థ్యాన్నీ ప్రదర్శించింది. వరుసగా నిర్వహించిన మూడు ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం కావడంతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలు కలిగిన దేశాల సరసన భారత్‌ నిలిచింది.

డీఆర్‌డీఓ నిర్వహించిన మూడు వరుస పరీక్షల్లో ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులు తమ లక్ష్యాలను కచ్చితంగా ఛేదించాయి. బహుళస్థాయి బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థ సామర్థ్యాన్ని ఈ పరీక్షలు నిరూపించాయి. ఆధునిక క్షిపణి ముప్పులను ఎదుర్కొనేలా రూపొందించిన ఈ వ్యవస్థ శత్రు బాలిస్టిక్‌ క్షిపణులను లక్ష్యానికి చేరకముందే నిర్వీర్యం చేయగలదని అధికారులు తెలిపారు.

ఈ విజయాలతో భారత్‌ ప్రపంచంలోని కొన్ని దేశాలకే ఉన్న ప్రత్యేక సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులు (ఐసీబీఎంలు) సహా అత్యంత ప్రమాదకరమైన క్షిపణి ముప్పును అడ్డుకునే రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసిన దేశాల జాబితాలో భారత్‌ చేరిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇది దేశ భద్రతా వ్యవస్థకు కీలక బలాన్ని చేకూర్చనుంది.

మరోవైపు నేవల్‌ యాంటీ-షిప్‌ మిసైల్‌ (మీడియం రేంజ్‌) తొలి ఫ్లైట్‌ టెస్ట్‌ను కూడా డీఆర్‌డీఓ విజయవంతంగా పూర్తి చేసింది. మధ్యశ్రేణి దూరంలో శత్రు యుద్ధ నౌకలను కచ్చితంగా లక్ష్యంగా చేసుకునే ఈ క్షిపణి భారత నౌకాదళ దాడి సామర్థ్యాన్ని మరింత పెంచనుంది. ఈ విజయాలపై డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు.

DRDO
India Ballistic Missile Defense
ICBM Interceptor Test
Rajnath Singh
Naval Anti Ship Missile
Indian Defense Technology

More Telugu News