ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌

  • ప్రజాస్వామ్యంలో తుది నిర్ణేతలు ప్రజలేనన్న పవన్‌
  • రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని స్పష్టీకరణ
  • ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నామని వ్యాఖ్య
ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం’ బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చారిత్రక విజయానికి కారణమైన ప్రజలకు, కూటమి శ్రేణులకు పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

‘‘రెండేళ్ల క్రితం ప్రజలు మాకు కేవలం అధికారాన్ని ఇవ్వలేదు.. ఒక పెద్ద బాధ్యతను అప్పగించారు. అహంకారం, విధ్వంసక రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమే 2024 ఎన్నికల ఫలితం. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం కూటమి ఏర్పడింది. అధికారాన్ని పంచుకోవడం కోసం కాదు.. బాధ్యతను పంచుకోవడం కోసం ఈ కూటమి ముందుకొచ్చింది’’ అని పవన్‌ అన్నారు. జనసేన కేవలం 21 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, ప్రజల ఆశీర్వాదంతో అన్ని స్థానాల్లో విజయం సాధించడం తమపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్‌ స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధికి కీలకమైన పంచాయతీరాజ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ఎన్‌డీయే ప్రభుత్వ సమష్టి కృషి వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోగలిగామని తెలిపారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

ఇటీవల జరిగిన విశాఖ స్టీల్‌ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని పవన్‌ పేర్కొన్నారు. ఆ దుర్ఘటన కారణంగానే ఈ నెల 9న జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసి ఇప్పుడు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

Pawan Kalyan
Andhra Pradesh Coalition Government
Chandrababu Naidu
Janasena Party
AP Development and Welfare
Vizag Steel Plant

More Telugu News