‘అఖండ’ కాంగ్రెస్‌ దిశగా అడుగులు? ఆ పార్టీలు విలీనం కానున్నాయా?

  • కాంగ్రెస్‌లోకి తిరిగి చేరే అంశంపై టీఎంసీ, ఎన్సీపీ-ఎస్‌పీ చుట్టూ చర్చ
  • మమతా, శరద్‌ పవార్‌ విలీనానికి సిద్ధమంటూ నానా పటోలే వ్యాఖ్యలు
  • రాహుల్‌ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్ష ఐక్యతకు కాంగ్రెస్‌ నేతల పిలుపు
  • సోనియా, రాహుల్‌తో మమతా-అభిషేక్‌ భేటీల తర్వాత ఊహాగానాలు
  • విలీన ప్రతిపాదన వస్తే టీఎంసీ నుంచే రావాలని కాంగ్రెస్‌ స్పష్టీకరణ
దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోందా? ఒకప్పుడు కాంగ్రెస్‌ నుంచి విడిపోయి ప్రాంతీయ పార్టీలను స్థాపించిన నేతలు మళ్లీ అదే గూటికి చేరబోతున్నారా? ఈ ప్రశ్నలే ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత సంక్షోభం, ఇటీవల జరిగిన వరుస రాజకీయ భేటీల నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ అంశంపై ఎన్‌డీటీవీ తాజాగా ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

విలీన ఊహాగానాలకు బలం
తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ పార్టీలో విలీనం కానుందనే ప్రచారాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్‌ ఇప్పటికే ఖండించినప్పటికీ మహారాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నానా పటోలే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. కాంగ్రెస్‌ భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీలు మళ్లీ ఒక్కటయ్యే దిశగా ఆలోచిస్తున్నాయని, శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం పొత్తు కాదని, విలీనం స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.

కాంగ్రెస్‌ నేతల సంకేతాలు
ఇటీవల శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ కూడా కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన చిన్న పార్టీలన్నీ తిరిగి కాంగ్రెస్‌లో కలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మాజీ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలన్నీ తిరిగి కాంగ్రెస్‌లో చేరి రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని బలపర్చాలని సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆయా పార్టీలు అధికారికంగా సమర్థించలేదు. శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే మాత్రం ‘‘సమయం వచ్చినప్పుడు చూద్దాం’’ అని అన్నారు.

భేటీలతో పెరిగిన ఆసక్తి
ఈ ఊహాగానాలకు ప్రధాన కారణం ఇటీవల ఢిల్లీలో జరిగిన రాజకీయ భేటీలే. ఇండియా కూటమి సమావేశం సందర్భంగా మమతా బెనర్జీ, అభిషేక్‌ బెనర్జీలు వరుసగా సోనియా, రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. ముఖ్యంగా అభిషేక్‌-రాహుల్‌ సమావేశం గంటన్నరపాటు సాగడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం విలీనం అంశంపై తమ నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేవని, అలాంటి ప్రతిపాదన వస్తే అది తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచే రావాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. దీంతో విలీనం చర్చలు వాస్తవ రూపం దాలుస్తాయా? లేక రాజకీయ ఊహాగానాలుగానే మిగిలిపోతాయా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

Congress Party
Mamata Banerjee
Sharad Pawar
Trinamool Congress Merger
Rahul Gandhi Leadership
India Alliance Politics

More Telugu News