క్రికెటర్ నుంచి ఇన్వెస్టర్గా.. ఫిట్నెస్ సంస్థలో భాగస్వామి అయిన రోహిత్ శర్మ
- ఫిట్నెస్ ప్లాట్ఫామ్ 'ఫిట్టర్'లో పెట్టుబడి పెట్టిన రోహిత్ శర్మ
- కంపెనీలో ఈక్విటీ పార్టనర్గా చేరిన భారత క్రికెటర్
- గతంలో ఫిట్టర్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన రోహిత్
- కంపెనీ వ్యాపార ప్రణాళికలు నచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడం, ఫిట్నెస్పై అవగాహన కల్పించడం, ఆరోగ్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరినట్టు ఫిట్టర్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడి పెట్టడానికి ముందు రోహిత్ శర్మ కొన్ని నెలల పాటు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ జితేంద్ర చౌక్సీతో పాటు ఇతర ముఖ్య బృందంతో చర్చలు జరిపినట్టు పేర్కొంది. కంపెనీ వ్యాపార సరళి, దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికలు, విస్తృత లక్ష్యాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఆయన ఇన్వెస్టర్గా మారాలని నిర్ణయించుకున్నారని వివరించింది.
ఈ సందర్భంగా ఫిట్టర్ వ్యవస్థాపకుడు జితేంద్ర చౌక్సీ మాట్లాడుతూ.. "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. సరైన పోషకాహారం, వ్యాయామం, క్రమశిక్షణ వంటి ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మంచి ఆరోగ్యానికి షార్ట్కట్లు ఉండవని మేము నమ్ముతాం. రోహిత్ కూడా ఇదే విషయాన్ని విశ్వసించడమే కాకుండా తన జీవితంలో పాటిస్తారు. మా మధ్య జరిగిన చర్చలు ఆయనను ఇన్వెస్టర్గా, భాగస్వామిగా మార్చడం చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.
ఈ భాగస్వామ్యంపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. "కంపెనీ వ్యాపార నమూనా, వృద్ధి పథాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను వారి బృందంతో సమయం గడిపాను, వ్యాపారాన్ని అర్థం చేసుకున్నాను. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో సహాయపడటం ద్వారా గొప్ప మార్పు తీసుకువచ్చే అవకాశం ఇక్కడ ఉంది. బలమైన పునాదులు, స్పష్టమైన లక్ష్యం ఉన్న ఈ కంపెనీలో భాగస్వామిని కావడం మంచి నిర్ణయం" అని వివరించాడు. ఈ కొత్త భాగస్వామ్యం ఫిట్టర్ వృద్ధి ప్రయాణంలో ఒక మైలురాయి అని, ప్రజలు తమ దీర్ఘకాలిక ఆరోగ్యంపై నియంత్రణ సాధించేలా ప్రోత్సహించడానికి ఇది మరింత దోహదపడుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది.