ఆఫ్రికా గడ్డపై క్రికెట్ పండుగ.. 2027 వరల్డ్ కప్ తేదీలు వచ్చేశాయ్!
- 2027 వన్డే ప్రపంచకప్కు ఆఫ్రికా దేశాల ఆతిథ్యం
- అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు మెగా టోర్నీ
- పాత ఫార్మాట్కు జై.. 14 జట్లతో ప్రపంచకప్ నిర్వహణ
- దక్షిణాఫ్రికాలో అత్యధిక మ్యాచ్లు, జింబాబ్వే, నమీబియాలో మరి కొన్ని నిర్వహణ
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కథనం ప్రకారం టోర్నీలోని అత్యధిక మ్యాచ్లకు దక్షిణాఫ్రికానే ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 54 మ్యాచ్లలో దాదాపు 41 మ్యాచ్లు దక్షిణాఫ్రికాలోనే జరగనున్నాయి. ఇక, జింబాబ్వే మూడు వేదికల్లో 8 నుంచి 10 మ్యాచ్లను, నమీబియా మూడు మ్యాచ్లను నిర్వహించనున్నాయి. జింబాబ్వేలోని విక్టోరియా ఫాల్స్లో కొత్తగా నిర్మిస్తున్న ఫేల్ మోసీ-ఓ-తున్యా స్టేడియం ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం కానుంది.
మళ్లీ 14 జట్లతో వన్డే ప్రపంచకప్..
గత రెండు ఎడిషన్లలో 10 జట్లతో టోర్నీ జరగగా, ఈసారి పాత ఫార్మాట్ను తిరిగి తీసుకువస్తున్నారు. మొత్తం 14 జట్లు ఈ ప్రపంచకప్లో పాల్గొంటాయి. వీటిని ఏడు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపు నుంచి టాప్-3లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు పూర్తిస్థాయి సభ్య హోదాలో నేరుగా ప్రవేశం లభిస్తుంది. అయితే, నమీబియా మాత్రం క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది.
2027-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) కింద జరగనున్న తొలి ఐసీసీ ఈవెంట్ ఇదే కావడం గమనార్హం. ఈ ప్రపంచకప్ తేదీలను మే నెలలో అహ్మదాబాద్లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో చర్చించగా, జులైలో ఎడిన్బర్గ్లో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) తుది ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫార్మాట్లో మార్పులు, అన్ని పూర్తిస్థాయి సభ్య దేశాలను అందులో భాగం చేయడం వంటి కీలక అంశాలపై కూడా ఐసీసీ తుది నిర్ణయాలు తీసుకోనుంది.