రాజస్థాన్ కాంగ్రెస్లో మళ్లీ విభేదాలు.. గెహ్లాట్కు పైలట్ కౌంటర్
- గెహ్లాట్ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న రాజస్థాన్ కాంగ్రెస్ వివాదం
- తనపై వస్తున్న విమర్శలకు పరోక్షంగా బదులిచ్చిన సచిన్ పైలట్
- కళ్లలోకి చూస్తే నిజం తెలుస్తుందంటూ వ్యాఖ్యలు
- వ్యక్తిగత శత్రుత్వం లేదన్న పైలట్
- 2022 నాటి పరిణామాలపై గెహ్లాట్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన పైలట్
కరౌలీ జిల్లాలోని సకర్ఘటా గ్రామంలో బుధవారం తన తండ్రి రాజేష్ పైలట్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సచిన్ పైలట్ ప్రసంగించారు. "ఎవరైనా కళ్లలోకి నేరుగా చూస్తే వారు నిజం చెబుతున్నారో లేదో తెలిసిపోతుంది. నేను కలిసి పనిచేసిన నాయకులను ఎప్పుడూ గౌరవించాను. అభిప్రాయ భేదాలు ఉండచ్చు, కానీ వ్యక్తిగత శత్రుత్వం ఎప్పుడూ లేదు" అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో పదవుల కంటే ప్రజాసేవకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, సత్యం మరియు ప్రజా ప్రయోజనాల పక్షాన నిలిచిన వారే అంతిమ విజేతలుగా నిలుస్తారని పేర్కొన్నారు.
జూన్ 7న గెహ్లాట్ మాట్లాడుతూ.. 2022 సెప్టెంబర్ 25న జరిగిన ఎమ్మెల్యేల సమావేశం అధిష్ఠానంపై తిరుగుబాటు కాదని, పైలట్ను ముఖ్యమంత్రిని చేయడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఘటన అని పేర్కొన్నారు. గతంలో పైలట్ను కేంద్ర మంత్రిని చేయడంలో తాను పోషించిన పాత్రను ఆయన ఎప్పుడూ ప్రస్తావించకపోవడం వ్యక్తిగతంగా తనను కలచివేసిందని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకే పైలట్ తాజాగా తనదైన శైలిలో సమాధానమిచ్చినట్లు కనిపిస్తోంది.
ఈ కార్యక్రమంలో పైలట్ ప్రధాన అనుచరుడు, మాజీ మంత్రి రమేశ్ మీనా.. అశోక్ గెహ్లాట్పై నేరుగా విమర్శలు గుప్పిస్తూ, 2020 నాటి రాజకీయ సంక్షోభంపై నార్కో టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలపై పైలట్ మాత్రం స్పందించలేదు. ఈ తాజా పరిణామాలు రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఇంకా సద్దుమణగలేదని తేటతెల్లం చేస్తున్నాయి.