భారతీరాజా మృతి: గుండె బరువెక్కిందంటూ రాధిక భావోద్వేగ నివాళి

  • తన జీవితానికి అమ్మ, భారతీరాజా రెండు స్తంభాలని వెల్లడి
  • ఒకే ఏడాది ఇద్దరు మూలస్తంభాలను కోల్పోయానంటూ ఆవేదన
  • మాటలు రావడం లేదని, గుండె బరువెక్కిందని సోషల్ మీడియాలో పోస్ట్
ప్రముఖ దర్శకుడు పి. భారతీరాజా మరణం పట్ల సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి, భావోద్వేగం వ్యక్తం చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన రెండు ముఖ్యమైన స్తంభాలలో ఒకరు తన తల్లి అయితే, మరొకరు తన గురువు భారతీరాజా అని ఆమె పేర్కొన్నారు. చెన్నైలోని తన నివాసంలో భారతీరాజా (84) వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాధిక సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు.

"నన్ను తీర్చిదిద్దిన ఇద్దరు వ్యక్తులు.. ఒకరు మా అమ్మ, మరొకరు నా గురువు భారతీరాజా గారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఆ రెండు స్తంభాలను నేను కోల్పోయాను. ఈ బాధను మాటల్లో వర్ణించలేను. నా గుండె బరువెక్కింది" అంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. వారి జ్ఞాపకాలు, వారు నేర్పిన జీవిత పాఠాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని తెలిపారు.

తమిళ చిత్ర పరిశ్రమలో గ్రామీణ వాస్తవిక చిత్రాలకు ఆద్యుడిగా పేరుగాంచిన భారతీరాజా, 'కిళక్కే పోగుమ్ రైల్' (1978) చిత్రంతో రాధికను వెండితెరకు పరిచయం చేశారు. అప్పటి నుంచి వారి మధ్య గురుశిష్యుల బంధం ఎంతో బలంగా కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అనారోగ్యంతో ఉన్న భారతీరాజాను కలిసినప్పుడు, 'తాయ్ కిళవి' చిత్రంలో తన నటనను ఆయన మెచ్చుకున్నారని, తనకు జాతీయ అవార్డు రావాలని ఆశీర్వదించారని రాధిక ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.                                

Bharathiraja
Raadhika Sarathkumar
Tamil Director Bharathiraja Death
Kizhakke Pogum Rail
Tamil Cinema News
Bharathiraja Passes Away

More Telugu News