వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్

  • వివిధ శాఖలకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు నిర్దేశించిన సీఎం
  • పనితీరు ఆధారంగా స్కోరింగ్ విధానం అమలుకు నిర్ణయం
  • ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికల రూపకల్పన
  • ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై ఆలోచన
  • 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధన కోసం డేటా ఆధారిత పాలనపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు, వృద్ధి రేటును పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ ప్రారంభించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) లక్ష్యాలు, ప్రభుత్వ శాఖల పనితీరును కొలిచే కీ-పెర్ఫార్మెన్సు ఇండికేటర్ల (కేపీఐ)పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వివిధ శాఖలకు కేపీఐలను సీఎం నిర్దేశించారు. జాతీయ సగటు కంటే వెనుకబడిన సూచికలను మెరుగుపరచడమే కాకుండా, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు. కేవలం నిర్దేశిత లక్ష్యాలే కాకుండా, వాస్తవ వృద్ధి (రియల్ గ్రోత్) ఆధారంగా శాఖల పనితీరును అంచనా వేసేందుకు స్కోరింగ్ విధానాన్ని అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.

రాష్ట్ర, క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలపై పెట్టే వ్యయం, ఆర్థిక కార్యకలాపాలను 3.5 రెట్లు పెంచేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఆర్థిక వ్యవహారాలను రియల్ టైంలో పర్యవేక్షించేందుకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలనే ఆలోచనను కూడా పంచుకున్నారు.

2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్‌పోర్టుల వంటి కీలక ప్రాజెక్టులతో ఆర్థిక వ్యవస్థకు 'మల్టిప్లైయర్ ఎఫెక్ట్' తీసుకురావాలని సూచించారు. కేపీఐలు మెరుగ్గా ఉంటేనే రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతుందని, ప్రతి రంగంలోనూ గ్రాస్ వాల్యూ అడిషన్ (జీవీఏ) పెంపుపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు.

Chandrababu Naidu
Andhra Pradesh economy
GSDP growth rate
Swarnandhra 2047
KPI performance scoring
AP infrastructure projects

More Telugu News