బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిపితే.. బీజేపీ గెలిచే అవకాశమే లేదు: తేజస్వి యాదవ్
- ఇండియా కూటమి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన తేజస్వి
- అందరం ఐక్యంగా పోరాడాలని నిర్ణయించామని వెల్లడి
- బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
దేశంలో ఎన్నికల ప్రక్రియపై ఆర్జేడీ నేత, బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన 'ఇండియా' కూటమి కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఈవీఎంలకు బదులుగా పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే... రాబోయే రోజుల్లో బీజేపీ విజయం సాధించే అవకాశమే లేదని ఆయన అన్నారు.
ఇదే సమావేశంలో ప్రతిపక్షాల ఐక్యతపై మాట్లాడుతూ.. ‘ఇండియా’ కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలు ఐదు ప్రధానాంశాలపై పూర్తి స్థాయి ఏకాభిప్రాయానికి వచ్చాయని తేజస్వి వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ఐదు అంశాలపైనే కలసికట్టుగా, ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకాన్ని, పారదర్శకతను మరింత బలోపేతం చేయాలంటే బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించడం ఒక్కటే మార్గమని అన్నారు. తేజస్వి యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.