సొంత పార్టీ మంత్రులను కూడా వదల్లేదు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన చామల
- . బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం
- ట్యాపింగ్ నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని జోస్యం
తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నేడు సిట్ ఎదుట హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీడియా కమిటీ చైర్మన్గా ఉన్న ఆయన ఫోన్... జులై 30 నుంచి ఎన్నికలు ముగిసే వరకు అక్రమంగా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించి, బాధితుడిగా ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.
విచారణ అనంతరం చామల మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల వ్యూహాలు పసిగట్టేందుకు, కాంగ్రెస్ ముఖ్య నేతల సంభాషణలు వినేందుకు ఈ ట్యాపింగ్ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు.
అంతేకాకుండా, కేసీఆర్ కేవలం ప్రతిపక్షాలనే కాక.. అధికారం కోసం సొంత పార్టీ మంత్రులు, నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని, అందులో మాజీ మంత్రి హరీశ్ రావు ఫోన్ కూడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి వెళ్లేవారిని ముందుగానే గుర్తించి బెదిరించారని దుయ్యబట్టారు. ఈ అక్రమ ట్యాపింగ్ నిందితులకు కచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని జోస్యం చెప్పారు.