ఇరాన్కు హర్మూజ్ ఎంత ముఖ్యమో, మనకు ఈ జలసంధి అంత ముఖ్యం!
- మలక్కా జలసంధిపై పట్టు సాధించేందుకు భారత్ భారీ వ్యూహం
- గ్రేట్ నికోబార్ దీవిలో 9 బిలియన్ డాలర్లకు పైగా వ్యయంతో మెగా ప్రాజెక్ట్
- చైనా వాణిజ్య, చమురు రవాణాకు కీలకమైన మార్గంపై నిఘా
- పర్యావరణ, ఆదివాసీ తెగల ఉనికికి ప్రమాదమని ఆందోళనలు
- ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంతో పనులు వేగవంతం
భారత ప్రధాన భూభాగానికి 1,600 కిలోమీటర్ల దూరంలో, మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉన్న ఈ దీవిలో అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, సైనిక-పౌర అవసరాలకు ఉపయోగపడే విమానాశ్రయం, విద్యుత్ కేంద్రం, భారీ టౌన్షిప్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతు, చైనా ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 80 శాతం ఈ జలసంధి గుండానే జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ భారత ఉనికిని బలోపేతం చేయడం ద్వారా సముద్ర వాణిజ్య మార్గాలపై నిఘా పెట్టవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యర్థుల కదలికలను సులభంగా పర్యవేక్షించవచ్చని భారత నౌకాదళ మాజీ వైస్ చీఫ్ శేఖర్ సిన్హా వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అల్ జజీరా కథనం ప్రకారం, ఈ ప్రాజెక్టుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నుంచి పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. దీంతో నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయి.
అయితే, ఈ భారీ ప్రాజెక్టుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత అరుదైన షోంపేన్, నికోబరేస్ ఆదివాసీ తెగలు నివసించే ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం వారి ఉనికికే ప్రమాదకరమని మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దాదాపు 10 లక్షల చెట్లను నరికివేయాల్సి రావడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇక్కడ పర్యటించి, సహజ, గిరిజన వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆందోళనల మధ్యే, జాతీయ భద్రతకు అత్యంత కీలకమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్తోంది.