అవును, తెలంగాణ మా జాగీరే: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గద్దర్ కూతురు కౌంటర్

  • తెలంగాణ మీ జాగీరా అన్న పవన్ వ్యాఖ్యలను ఖండించిన వెన్నెల
  • తెలంగాణ గడ్డ నిన్న, నేడు, రేపు మా జాగీరేనంటూ కౌంటర్
  • తెలంగాణ పోరాటాలతో, ఆత్మబలిదానాలతో వచ్చిందన్న వెన్నెల
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గద్దర్ కూతురు వెన్నెల తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ మాట్లాడిన మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, తన తండ్రి వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

"పవనన్న, మిమ్మల్ని ఒక నటుడిగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు గౌరవిస్తారు. కానీ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలను ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖండిస్తున్నాను" అని వెన్నెల స్పష్టం చేశారు. "తెలంగాణ మీ జాగీరా అని అడిగారు. అవును, తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే. ఈరోజు మా జాగీరు. రేపు మా బిడ్డల జాగీరు. ఇది ముమ్మాటికీ మా జాగీరే" అంటూ ఆమె ఘాటుగా బదులిచ్చారు.

పైసలు పంచితే, లాబీలు చేస్తే తెలంగాణ రాలేదని, పోరాటాలతో వచ్చిందని అన్నారు. ఎవరినీ బాధపెట్టకుండా, హింసించకుండా, తమకు తాము ప్రాణాలు అర్పించుకుని తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఇందుకు శ్రీకాంతచారి ఉదాహరణ అని చెప్పారు. పల్లెపల్లెలో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారని అన్నారు.

తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించి, జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జూన్ 2న హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమని, తెలంగాణ ఎవరి జాగీరు కాదని అన్నారు. గద్దర్‌కు తాను వాహనం కొనిచ్చి సహాయం చేశానని గుర్తుచేసుకుంటూ, ఏపీలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తానని కూడా తెలిపారు.

Gaddar Daughter fires at Pawan Kalyan
Vennela at Pawan Kalyan

More Telugu News