అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్ఠాత్మక అవార్డు
- అమెరికాలో తెలుగు విద్యార్థిని అనన్య గోలికి అరుదైన గౌరవం
- కంప్యూటింగ్ రంగంలో ప్రతిభకు 'స్టేట్ ఆనరబుల్ మెన్షన్' పురస్కారం
- పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కుటుంబం
- టెక్నాలజీలో బాలికలను ప్రోత్సహించే మిన్నెసోటా టెక్నాలజీ ఫౌండేషన్ ఈ అవార్డు ఇస్తుంది
హైస్కూల్ విద్యార్థుల్లో కంప్యూటింగ్, టెక్నాలజీ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ వంటి అంశాల్లో చూపిన ప్రతిభకు ఈ అవార్డును అందిస్తారు. ముఖ్యంగా టెక్ రంగంలో బాలికలను, ఇతర వర్గాల వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది ఈ గౌరవానికి ఎంపికైన ఎనిమిది మంది విద్యార్థుల్లో అనన్య ఒకరిగా నిలవడం విశేషం.
అనన్య తల్లిదండ్రులు గోలి కృష్ణ చైతన్య, సంప సిన్హా. వీరి స్వస్థలం పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి. సాఫ్ట్వేర్ నిపుణులైన వీరు 2014లో అమెరికాలో స్థిరపడ్డారు. అనన్య ప్రస్తుతం మిన్నెసోటాలోని ఈడెన్ ప్రైరీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ విమెన్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NCWIT) అనుబంధ సంస్థ అయిన మిన్నెసోటా టెక్నాలజీ ఫౌండేషన్ ఈ అవార్డులను నిర్వహిస్తోంది. చిన్న వయసులోనే టెక్నాలజీలో తెలుగు బాలిక గుర్తింపు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.