ఆ సమయంలో 'పెద్ది' నుంచి తప్పుకుందామని అనుకున్నాను: శివ రాజ్ కుమార్

  • క్యాన్సర్ చికిత్స సమయంలో 'పెద్ది' సినిమా వదిలేయాలనుకున్న శివ రాజ్ కుమార్
  • తప్పుకోవద్దని, తాము వేచిచూస్తామని చెప్పిన చిత్రబృందం
  • 2024లో బ్లాడర్ క్యాన్సర్‌కు అమెరికాలో చికిత్స తీసుకున్న శివన్న
  • రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది'
  • జూన్ 4న థియేటర్లలోకి రానున్న పాన్-ఇండియా మూవీ
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తాను నటించిన 'పెద్ది' సినిమా గురించి ఒక భావోద్వేగ విషయాన్ని వెల్లడించారు. 2024లో తనకు క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని భావించినట్లు తెలిపారు. అయితే, దర్శకుడు బుచ్చిబాబు సానా సహా చిత్రబృందం తన స్థానంలో మరొకరిని తీసుకోకుండా, తాను కోలుకునే వరకు ఎదురుచూశారని ఆయన గుర్తుచేసుకున్నారు.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో జరిగిన ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా, "సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. కానీ బుచ్చిబాబు 'వద్దు, మీరే కావాలి' అన్నారు. వాళ్లు నా కోసం చాలా కాలం ఎదురుచూశారు. వారికి నా ధన్యవాదాలు" అని శివ రాజ్ కుమార్ పేర్కొన్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా కథ చెప్పిన రోజే రామ్ చరణ్‌తో కూడా మాట్లాడానని గుర్తుచేసుకున్నారు.

2024లో శివ రాజ్ కుమార్‌కు బ్లాడర్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన అమెరికాలోని మయామిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. క్యాన్సర్ సోకిన బ్లాడర్‌ను తొలగించి, పేగులోని కొంత భాగంతో వైద్యులు కృత్రిమ బ్లాడర్‌ను ఏర్పాటు చేశారు. 2025 ప్రారంభంలో ఆయన క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.

ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్ నటన అద్భుతంగా ఉందని రామ్ చరణ్ ప్రశంసించారు. తాను సినిమాను చాలాసార్లు చూశానని, ముఖ్యంగా శివ రాజ్‌కుమార్‌పై చిత్రీకరించిన ఒక స్లో-మోషన్ సన్నివేశం బాగా గుర్తుండిపోయిందని అన్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Shiva Rajkumar
Peddhi Movie
Ram Charan
Buchi Babu Sana
Janhvi Kapoor
Kannada Superstar
Cancer Diagnosis
Movie Promotion
Telugu Cinema
Indian Cinema

More Telugu News