నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రభుత్వానికి షర్మిల హెచ్చరిక
- నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై షర్మిల ఆగ్రహం
- ఇది చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపణ
- పోలీసులు చూస్తూ ఉన్నా దాడిని ఆపలేదని విమర్శ
- విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరిక
- నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్
నంద్యాలలోని శ్రీనివాస సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహంపై ఓ వ్యక్తి దాడి చేసి ధ్వంసం చేశాడని షర్మిల తెలిపారు. పట్టపగలు ఈ ఘటన జరుగుతుంటే, అక్కడే ఉన్న పోలీసులు నిలువరించకపోవడం హేయమైన చర్య అని ఆమె విమర్శించారు. దాడి చేసిన వ్యక్తికి మానసిక స్థితి బాగోలేదని చెప్పి పోలీసులు చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు.
ఇది చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు ఉందని షర్మిల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి ఘటనలను చూస్తూ చోద్యం చూడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడితో పాటు, అతని వెనుక ఉన్న శక్తులెవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పాత విగ్రహం స్థానంలో వెంటనే కొత్తది ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో నంద్యాలలో అదే సెంటర్లో తాను ఆమరణ దీక్షకు దిగుతానని ముఖ్యమంత్రిని హెచ్చరించారు.