ఏపీకి మరో 7 ఎయిర్‌పోర్టులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

  • లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు
  • వర్చువల్‌గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
  • జులైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడి
  • ఏపీలో పెట్టుబడులకు ఎన్ఆర్ఐలకు వారధిగా ఉంటానన్న కోమటి జయరాం
లాస్ ఏంజెల్స్‌లో ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు ఎన్నారై టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని కీలక ప్రకటన చేశారు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.

ఆరెంజ్ సిటీలోని తండూరి రెస్టారెంట్‌లో జరిగిన ఈ వేడుకకు 150 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రవాస తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేశ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని తెలిపారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వివరించారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జులైలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు ఇప్పటికే నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించామని, త్వరలోనే మలేషియా, హాంగ్ కాంగ్, గల్ఫ్ దేశాలకు కూడా సర్వీసులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కూటమి విజయంలో ఎన్ఆర్ఐల పాత్ర మరువలేనిదని కొనియాడారు.

   
ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రవాసాంధ్రుల సహకారం ఎంతో అవసరమని, ఏపీలో పెట్టుబడులు పెట్టే ఎన్ఆర్ఐలకు తాను వారధిగా ఉంటానని హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్ఆర్ఐలు తమ సహకారం అందించాలని కోరారు.

   
లాస్ ఏంజిల్స్ ఎన్నారై టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట్టి, శ్రీధర్ సాతులూరి, వంశీ గరికపాటి, విష్ణు యలమంచి తదితరుల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ కేక్ కట్ చేసి, ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. మహానాడు తీర్మానాలు, రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్రపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు కీలక నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Ram Mohan Naidu
Andhra Pradesh
AP Airports
NRI TDP
BhogaPuram Airport
Chandrababu Naidu
Lokesh
NTR Jayanthi
Mini Mahanadu
AP Development

More Telugu News