దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా: జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌కు వైసీపీ వినతి

Justice Balakrishnan Commission YSRCP Appeals for Dalit Christian SC Status
  • సానుకూలంగా నివేదిక ఇచ్చి వారికి న్యాయం చేయాలని డిమాండ్
  • మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష పోదని నేతల వాదన
  • ఢిల్లీలో కమిషన్‌ను కలిసిన ఎంపీ గురుమూర్తి నేతృత్వంలోని బృందం
దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నిన్న ఢిల్లీలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్‌ను కలిసిన వైసీపీ ప్రతినిధి బృందం ఒక వినతిపత్రం సమర్పించింది. దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా కమిషన్ సానుకూల నివేదిక ఇవ్వాలని నేతలు కోరారు.

అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి, షెడ్యూల్డ్ కులాలకు అందుతున్న అన్ని హక్కులు, రక్షణలు దళిత క్రైస్తవులకు కూడా వర్తింపజేయాలని అన్నారు. మతం మారినప్పటికీ దళితులు సామాజికంగా, ఆర్థికంగా వివక్షను ఎదుర్కొంటున్నారని, కాబట్టి వారికి ఎస్సీ హోదా నిరాకరించడం సరికాదని నేతలు వాదించారు. మతం ఆధారంగా వివక్ష చూపడం ఆగిపోవాలని, దళితుల హక్కుల పరిరక్షణలో కేంద్రం సమానత్వంతో వ్యవహరించాలని ఎంపీ గొల్ల బాబూరావు విజ్ఞప్తి చేశారు.

ఇదే అంశంపై గతంలో వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు, మాజీమంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Justice Balakrishnan Commission
Dalit Christians
Scheduled Caste Status
YSRCP
Goll Baburao
AP Assembly Resolution
Social Discrimination
Religious Discrimination
Indian Constitution

More Telugu News