హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. 11 మందికి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు

  • 11 మంది విద్యార్థులకు రూ.7 లక్షల వార్షిక ప్యాకేజీ
  •  డేటా సెంటర్ మేనేజ్‌మెంట్ కోర్సులో 14 మందికి గాను 11 మంది ఎంపిక
  •  పరిశ్రమలకు సిద్ధమైన ప్రతిభను అందించడంలో ఇది ఒక మైలురాయి అన్న వర్సిటీ
హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) విద్యార్థులు సత్తా చాటారు. వర్సిటీలో డేటా సెంటర్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసుకున్న 11 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగాలు సంపాదించారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంపికైన వీరికి ఏటా రూ.7 లక్షల ప్యాకేజీని మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది.

ఈ కోర్సులో మొత్తం 14 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోగా, వారిలో 11 మంది మైక్రోసాఫ్ట్‌కు ఎంపిక కావడం విశేషం. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు గల మానవ వనరులను అందించాలనే లక్ష్యంతో ఈ వర్సిటీ పనిచేస్తోందని అధికారులు తెలిపారు.

తమ విద్యార్థుల విజయంపై యూనివర్సిటీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. "పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దడంలో ఇదొక గర్వించదగ్గ మైలురాయి" అని అభివర్ణించింది. తెలంగాణ ప్రభుత్వం 2024 ఆగస్టులో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ క్యాంపస్ నుంచి ఈ వర్సిటీ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రారంభమైన కొద్ది కాలంలోనే వర్సిటీ 17 కోర్సులను ప్రవేశపెట్టి, 418 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.

Young India Skills University
YISU
Microsoft
Hyderabad
Telangana
Data Center Management
Campus Placement
IT Jobs
Skill Development
Gachibowli

More Telugu News