డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకు, ఢిల్లీ పెద్దల వద్ద సిద్ధరామయ్య సరికొత్త ప్రతిపాదన!

  • ప్రభుత్వం, పార్టీకి సమన్వయ కమిటీని వేయాలని విజ్ఞప్తి
  • తనకు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించాలని సిద్ధరామయ్య ప్రతిపాదన
  • 2018లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్‌గా వ్యవహరించిన సిద్ధరామయ్య
కర్ణాటకలో అధికారం చేతులు మారుతోంది. సిద్ధరామయ్య ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. డీకే శివకుమార్ త్వరలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం పదవిని వదులుకోవడానికి ముందు నుంచి సిద్ధరామయ్య ఇష్టపడటంలేదు. కానీ అధిష్ఠానం ఒప్పించడంతో ఆయన రాజీనామా చేశారు. డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించడానికి ముందే... పార్టీలో ఆధిపత్యం కోసం అలాగే, రేపు ఆయన సీఎం అయ్యాక పాలనపరంగానూ తమ పట్టు నిలుపుకునేందుకు సిద్ధరామయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

నిన్న రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య తన కుమారుడితో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీని కలిసి తన కుమారుడికి కీలకమైన శాఖలు అప్పగించాలని కోరారు. తాజాగా ఆయన అధిష్ఠానం ముందు మరో కీలక ప్రతిపాదన ఉంచారు.

కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మధ్య సమన్వయం చేయడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీని వేయాలని, తనకు ఛైర్మన్ బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్ పెద్దల ముందుకు ప్రతిపాదన తీసుకువెళ్లారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ కమిటీ ఉంటే బాగుంటుందని సూచించారు.

2018లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో సిద్ధరామయ్య సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, ఇప్పుడు మరోసారి ఈ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. అయితే పార్టీకి సొంతగా మెజారిటీ ఉన్న నేపథ్యంలో సమన్వయ కమిటీ అవసరం లేదని అధిష్ఠానం చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Siddaramaiah
DK Shivakumar
Karnataka Politics
Congress Party
AICC
Rahul Gandhi
Mallikarjuna Kharge

More Telugu News