తడిసిన ధాన్యం సహా ప్రతి గింజనూ కొంటాం: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Uttam Kumar Reddy Assures Purchase of Every Grain of Paddy in Telangana
  • వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై మంత్రి మీడియా సమావేశం
  • ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని మండిపాటు
  • 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
  • ఇప్పటికే 62 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించినట్లు వెల్లడి
  • ఇప్పటికే రూ.13,050 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్న మంత్రి
ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం వరి కొనుగోలు కోసం చేస్తున్నంత ఖర్చు భారతదేశ చరిత్రలో ఏనాడూ ఏ ప్రభుత్వమూ చేయలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే అంగీకరించిందని గుర్తు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా వరి కొనుగోళ్లు జరపడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి వెల్లడించారు.

చివరి గింజ వరకు కొంటాం
రైతులను ఆదుకుంటామంటూ బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలో నాటకీయ నిరసనలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల విధానం ప్రకారమే తాము ధాన్యాన్ని సేకరిస్తున్నామని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ యాసంగి సీజన్ పంటలో రాష్ట్రవ్యాప్తంగా 141 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిందని, అందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశామన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇందులో కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని ముందే చెప్పిందని వెల్లడించారు. మిగిలిన అదనపు ధాన్యాన్ని రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వమే అప్పు చేసి మరి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు.

తడిసిన ధాన్యం కూడా కొనుగోలు
ఈ యాసంగి పంటలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, అక్కడ రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇప్పటికే రూ.13,050 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

రవాణా కోసం ప్రత్యేక చర్యలు
ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇసుక లారీలను, అలాగే ఇతర ఫ్యాక్టరీల్లో నడిచే భారీ వాహనాలను కూడా ధాన్యం సేకరణకు ఉపయోగించాలని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకోసం వాహనాలను కేటాయించాలని ఆయా యాజమాన్యాలను కోరినట్లు తెలిపారు. అయితే, ప్రస్తుతం హమాలీల కొరత కొంత వేధిస్తోందని, బీహార్, బెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులపైనే ఇందుకు ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని మంత్రి వివరించారు. ఈ ఇబ్బందులను కూడా అధిగమించి కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Go Back to Shorts
Uttam Kumar Reddy
Telangana
Paddy Procurement
Paddy
Farmers
Minimum Support Price
Civil Supplies Department
Agriculture
Telangana Government
Paddy Purchase

More Telugu News