ఎయిర్ హోస్టెస్‌తో విజయ్.. వైరల్ అయిన ఫొటో.. సీఎం సింప్లిసిటీపై ప్రశంసలు

  • ఢిల్లీ పర్యటన ముగించుకుని వస్తూ విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో ఫొటో
  • సీఎం విజ‌య్‌ నిరాడంబరతపై ఫ్యాన్స్‌ నుంచి ప్రశంసలు
  • తొలిసారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ
తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ ఓ విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ప్రదర్శించిన నిరాడంబరత, సామాన్య ప్రజలతో కలిసిపోయే తత్వంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటించిన విజయ్, తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఉమా మీనాక్షి అనే ఎయిర్ హోస్టెస్, సీఎం విజయ్‌తో ఫొటో దిగే అవకాశాన్ని పొందారు. ఈ ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. "గౌరవనీయ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (అందరూ ప్రేమగా పిలుచుకునే దళపతి) గారితో ప్రయాణించడంతో ఈరోజు నా విధి నిర్వహణ మరింత ప్రత్యేకంగా మారింది" అని రాసుకొచ్చారు. తెలుపు, నలుపు దుస్తుల్లో ఎంతో ప్రశాంతంగా కనిపించిన విజయ్ ఫొటో క్షణాల్లో ఫ్యాన్ పేజీలు, రాజకీయ వర్గాల్లో వైర‌ల్‌గా మారింది. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ తన పాత వ్యక్తిత్వాన్ని కొనసాగిస్తున్నారంటూ పలువురు కామెంట్లు చేశారు.

ఈ పర్యటనకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో విజయ్ సమావేశమయ్యారు. తమిళనాడుకు రావాల్సిన నిధులు, మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం.

సినిమా స్టార్ నుంచి సీఎంగా.. 
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీని 2024లో ప్రారంభించిన విజయ్, అనతికాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తనకున్న భారీ అభిమాన గణాన్ని రాజకీయ మద్దతుగా మార్చుకుని, ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా నిలిచారు. యువత, సుపరిపాలన, అవినీతి నిర్మూలన వంటి అంశాలపై దృష్టి సారించి ప్రచారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలిచి టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నెల‌ 13న కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గారు.

Vijay Joseph
Tamil Nadu CM
C Joseph Vijay
Tamil Nadu Politics
Air Hostess Photo
Uma Meenakshi
Delhi Visit
Tamilaga Vettri Kazhagam
TVK Party
Tamil Nadu Funds

More Telugu News