ఎంబీయే ఖర్చు రూ.18 లక్షలు, జీతం రూ.28 వేలు... యువకుడి కష్టాలు వైరల్!

  • రూ.18 లక్షలు ఖర్చు చేసి ఎంబీఏ చదివితే జీతం కేవలం రూ.28 వేలు
  • భూమి అమ్మి, అప్పులు చేసి కొడుకుని చదివించిన తల్లిదండ్రులు
  • ప్రైవేట్ విద్య, ఉద్యోగాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
  • భారీ ఫీజులు వసూలు చేస్తూ తప్పుడు ప్లేస్మెంట్ హామీలు ఇస్తున్నారని విమర్శలు
  • డిగ్రీల కంటే నైపుణ్య వృత్తులకే ఎక్కువ ఆదాయం అని నెటిజన్ల అభిప్రాయం
మా అబ్బాయి భవిష్యత్తు కోసం ఆస్తులమ్మి, అప్పులు చేసి రూ. 18 లక్షలతో ఎంబీఏ చదివించాం. కానీ ఇప్పుడు వాడికి వచ్చే జీతం నెలకు కేవలం రూ. 28 వేలు మాత్రమే.".. ఇదీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ తండ్రి ఆవేదన. ఈ ఒక్క పోస్ట్, దేశంలో ఉన్నత విద్యకు అవుతున్న ఖర్చుకు, ఉద్యోగాల్లో లభించే రాబడికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

పంక్స్ అరోరా అనే ఎక్స్ (ట్విట్టర్) యూజర్ షేర్ చేసిన ఈ కథనం ప్రకారం, ఓ మధ్యతరగతి కుటుంబం తమ కొడుకును ఎంతో కష్టపడి ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదివించింది. చదువు పూర్తయ్యాక మరో నగరంలో ఉద్యోగంలో చేరిన ఆ యువకుడికి అద్దె, ఇతర ఖర్చులు పోను చేతిలో ఏమీ మిగలని దుస్థితి. ఇదే సమయంలో, విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసిన ఆ కాలేజీ యజమాని మాత్రం ఫార్చ్యూనర్ కారు నుంచి బీఎండబ్ల్యూ కారుకు మారారని ఆ పోస్ట్ లో పేర్కొనడం గమనార్హం.

ఈ పోస్ట్ కు నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వస్తోంది. ఎంతోమంది తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 15 లక్షలు ఖర్చు చేస్తే రూ. 22 వేల జీతం ఉద్యోగం వచ్చిందని ఒకరు, తమ రిటైర్మెంట్ డబ్బులన్నీ పిల్లల చదువులకే పెట్టామని మరికొందరు వాపోయారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ప్లేస్మెంట్స్ పేరుతో ఇచ్చే తప్పుడు ప్రకటనలు, అధిక ఫీజులు, నాణ్యతలేని విద్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంబీఏ గ్రాడ్యుయేట్ల కన్నా నైపుణ్యం ఉన్న ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు వంటి వృత్తి నిపుణులే మెరుగైన ఆదాయం పొందుతున్నారని కొందరు పోల్చి చూపిస్తున్నారు. కేవలం సామాజిక గౌరవం కోసం, కాలేజీల నాణ్యతను పరిశీలించకుండా తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలను చదివించడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి, ఈ ఉదంతం విద్యారంగంలో వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది.

MBA Graduate
MBA
Education Costs
Job Market
Private Colleges
Student Loans
Higher Education
Employment
Panks Arora

More Telugu News