రేవంత్కు మోదీ ఆఫర్.. భవిష్యత్తులో రేవంత్ పశ్చాత్తాపపడొచ్చు: ధర్మపురి అర్వింద్
- సువేందు అధికారి, షిండేకు ఇచ్చినట్టుగా రేవంత్ కు మోదీ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చన్న అర్వింద్
- ఆఫర్ తిరస్కరించినందుకు భవిష్యత్తులో రేవంత్ పాశ్చాత్తాప పడొచ్చని వ్యాఖ్య
- భగీరథ్ పై పోక్సో కేసు వెనుక తన హస్తం ఉందన్న ప్రచారాన్ని ఖండించిన అర్వింద్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనలేరని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కూడా మోదీ ఒక ఛాన్స్ ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గతంలో పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేలకు ఇచ్చిన తరహాలోనే రేవంత్రెడ్డికి కూడా మోదీ ఆఫర్ ఇచ్చి ఉండవచ్చని, ఈ ప్రతిపాదనను తిరస్కరించినందుకు భవిష్యత్తులో రేవంత్ పశ్చాత్తాపపడాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు.
ఇక పార్టీ అంతర్గత వ్యవహారాలు, వివాదాలపై కూడా అరవింద్ ఓపెన్గా స్పందించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో ఉన్న విభేదాలపై మాట్లాడుతూ.. పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమని, అయితే తాను ఎవరిపైనా అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయలేదన్నారు. అలాగే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు వెనుక తన హస్తం ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు, ఆ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. పోక్సో కేసు నమోదైన తర్వాత తాను బండి సంజయ్ తో మాట్లాడలేదని చెప్పారు. గతంలో తానే రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని కోరానని, అయితే కొత్తగా పార్టీలోకి రావడంతో అది కుదరదని అధిష్ఠానం తేల్చి చెప్పినట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తున్నా, తెలంగాణలో మాత్రం అధికారం చేరువలో కనిపించకపోవడానికి స్థానిక నాయకత్వ సమస్యలే కారణమని అర్వింద్ అంగీకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తరహాలో పెద్ద గ్రూప్ లీడర్లు లేకపోవడం తమ పార్టీకి ప్రధాన సమస్యగా మారిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి రాకపోవడం తమ పార్టీ తప్పేనని, ప్రజలు ఆ సమయంలో తమను కోరుకోలేదన్నది నిజమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని సగం క్యాబినెట్లో క్వాలిటీ కాంగ్రెస్ లేదని, సీఎం రేవంత్రెడ్డి దగ్గర పనిచేసేందుకు మంత్రులే ఇష్టపడటం లేదని అన్నారు.