కామెంటరీ బాక్స్లో నోరు నొక్కేస్తున్నారు: శివరామకృష్ణన్
- కామెంటరీ చెప్పేవారికి స్వేచ్ఛ ఉండదన్న శివరామకృష్ణన్
- కామెంటరీ బాక్స్ లో పరిస్థితి నరకంలా ఉంటుందని వ్యాఖ్య
- బ్రాడ్కాస్టర్లు, బోర్డు ప్రతినిధులు ముందేగానే గైడ్ లైన్స్ ఇస్తారని వెల్లడి
క్రికెట్లో మైక్ పట్టుకుని ప్యాషన్తో చేసే కామెంటరీ వెనుక ఉండే కఠినమైన నియమాలు, నియంత్రణలపై భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైవ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కామెంటరీ చెప్పే వారికి అసలు పూర్తి స్వేచ్ఛే ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కామెంటరీ బాక్స్లో కూర్చుని అద్భుతంగా మాట్లాడుతున్నారని చాలామంది అభిమానులు అనుకుంటారని, కానీ అక్కడ పరిస్థితి నరకంలా ఉంటుందని ఆయన తెలిపారు. మైక్ ఆన్ చేయక ముందే బ్రాడ్కాస్టర్లు, బోర్డు ప్రతినిధులు కొన్ని స్పష్టమైన గైడ్లైన్స్ ఇస్తారని పేర్కొన్నారు. ఫలానా ఆటగాడిని ఎక్కువగా విమర్శించకూడదని, వివాదాస్పద నిర్ణయాలు లేదా పిచ్ నాణ్యత గురించి నెగెటివ్గా మాట్లాడకూడదంటూ ముందే నోరు నొక్కేస్తారని కామెంట్ చేశారు. తాము కేవలం వారు రాసిచ్చిన స్క్రిప్ట్ను, వారు కోరుకున్న అభిప్రాయాలనే మైక్ ముందు చెప్పాల్సి వస్తుందని వాపోయారు.
ముఖ్యంగా భారీ టీ20 లీగ్స్, ద్వైపాక్షిక సిరీస్ల సమయంలో ఈ నియంత్రణ మరీ ఎక్కువగా ఉంటోందని లక్ష్మణ్ శివరామకృష్ణణ్ ఆరోపించారు. నిష్పక్షపాతంగా లోపాలను ఎత్తిచూపాలని చూస్తే.. తదుపరి సిరీస్లకు కాంట్రాక్టుల నుంచి తొలగిస్తామనే పరోక్ష హెచ్చరికలు వస్తాయన్నారు. కేవలం కెరీర్ కోసం, డబ్బుల కోసమే చాలామంది బ్రాడ్కాస్టర్లు చెప్పినట్లే తలలూపుతున్నారని ఆయన విమర్శించారు.