రేపు కావలికి సీఎం చంద్రబాబు... మత్స్యకారుల ఖాతాల్లో రూ.20 వేలు జమ

  • వేట విరామ సమయంలో మత్స్యకారులకు రెండో ఏడాది ఆర్థిక సాయం
  • నెల్లూరు జిల్లా కావలిలో నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
  • 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్ల లబ్ధి, ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు
  • ఎన్నికల హామీ మేరకు సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన ప్రభుత్వం
  • రెండు సంవత్సరాల్లోనే మత్స్యకార కుటుంబాలకు రూ.505 కోట్ల మేర లబ్ధి
 సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఏపీలోని కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ఆర్థిక భరోసా కల్పించనుంది. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తూ, ఒక్కో కుటుంబానికి రూ.20,000 చొప్పున మొత్తం రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామంలో రేపు (మంగళవారం) జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి చాటనున్నారు.

ప్రతీ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల ప్రజనన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని వేటపై నిషేధం విధిస్తారు. ఈ సమయంలో ఉపాధి కోల్పోయి మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.10,000గా ఉన్న ఈ సహాయాన్ని, ఎన్డీఏ కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.20,000కు పెంచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాలుగా ఉన్నప్పటికీ, బలహీన వర్గాల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు అందించిన ప్రభుత్వం, ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్యను పెంచి 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్లు విడుదల చేస్తోంది. దీంతో ఈ రెండేళ్లలోనే వేట నిషేధ భృతి కింద ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.505 కోట్లకు చేరుకుంది. లబ్ధిదారుల సంఖ్యను పెంచడం, సాయాన్ని రెట్టింపు చేసి సకాలంలో అందించడం మత్స్యకారుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది.

ఇదే కాకుండా, వేట చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. 2024-25లో 63 క్లెయిమ్స్‌కు గాను రూ.3.15 కోట్లు, 2025-26లో పెండింగ్‌లో ఉన్న 113 క్లెయిమ్స్‌కు రూ.5.65 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచే ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి సారించిన ప్రభుత్వం, సముద్రపు నాచు (సీవీడ్) సాగును ప్రోత్సహిస్తూ వారికి అదనపు భరోసా కల్పిస్తోంది.

Chandrababu Naidu
Andhra Pradesh
Fishermen
Matsyakarula Sevalo Scheme
Financial Assistance
Tummala Penta
Kavali
Fishing Ban
Nellore District
AP Government

More Telugu News