రిక్షా తొక్కుతూ నిరసన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు
- ఇంధన ధరల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టిన అంబటి
- దేశంలో ఏపీలోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని విమర్శ
- ప్రజల కష్టాలు వారికి పట్టడం లేదని ఆగ్రహం
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైసీపీ గుంటూరులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో అంబటి రాంబాబు స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న రీతిలో తన నిరసనను వ్యక్తం చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే ఇంధన ధరలు అత్యంత ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు చెప్పిన 'సంపద సృష్టి', 'సుపరిపాలన' అంటే ఇదేనా అంటూ నిలదీశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర పన్నులను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేస్తామని హామీలు గుప్పించిన నారా లోకేష్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను నట్టేట ముంచారని అంబటి రాంబాబు మండిపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వానికి కేవలం కమీషన్లు వచ్చే పనులపైనే శ్రద్ధ ఉందని, ప్రజల కష్టాలు వారికి పట్టడం లేదని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ప్రజలకు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు.
ఒకవైపు ఇంధన ధరల భారంతో సామాన్యుడు నలిగిపోతుంటే, మరోవైపు ఆర్టీసీ, మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కేవలం వైసీపీ నేతలపైనే కాకుండా, టీడీపీతో కలిసి ఉన్న జనసేన పార్టీ నేతలపై కూడా అమలు చేస్తున్నారని ఆరోపించారు. ముట్లూరులో జరిగిన ఘర్షణల నేపథ్యంలో జనసేన కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని, అదే సమయంలో టీడీపీకి చెందిన కల్యాణ చక్రవర్తిపై ఉన్న కేసులను మాత్రం ప్రభుత్వం దొడ్డిదారిన మాఫీ చేస్తోందని వివరించారు.
తన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడతానని ప్రగల్భాలు పలికే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తన సొంత పార్టీ వారికి అన్యాయం జరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తమను గెలిపించిన సొంత ఓటర్లు, కార్యకర్తలపైనే అధికార మదంతో కేసులు పెడుతూ వేధిస్తున్నారని మండిపడ్డారు.
దక్షిణ భారతదేశంలో జనాభా సమతుల్యత కోసం ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై స్పందిస్తూ.. అసలు అలాంటి విషయాల గురించి మాట్లాడే నైతిక హక్కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదంటూ అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు.