‘మన దేశం గురించి తెలియకనే ఆ విమర్శలు’.. డచ్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్

  • భారత్‌లో మైనారిటీల హక్కులపై డచ్ ప్రధాని ఆరోపణలు
  • భారత సామాజిక వ్యవస్థ, చరిత్రను వివరిస్తూ విదేశాంగ శాఖ కౌంటర్‌
  • అనేక మతాలు శతాబ్దాలుగా వర్ధిల్లుతున్నాయని స్పష్టం
భారత్‌లో పత్రికా స్వేచ్ఛ, మైనారిటీల హక్కులపై డచ్ ప్రధానమంత్రి రోబ్ జెట్టన్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. మన దేశ సామాజిక, ప్రజాస్వామ్య వ్యవస్థపై కనీస అవగాహన, తగిన సమాచారం లేకపోవడం వల్లే ఇలాంటి విమర్శలు చేశారని తిప్పికొట్టింది. ది హేగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ.. కేవలం అజ్ఞానం వల్లే ఇలాంటి ప్రశ్నలు, ఆరోపణలు ఎదురవుతున్నాయని స్పష్టం చేశారు.

రోబ్ జెట్టన్ ఏమన్నారంటే.. 
ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశానికి ముందు రోబ్‌ జెట్టన్‌ భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కేవలం పత్రికా స్వేచ్ఛతో పాటు మైనారిటీల హక్కులు ఒత్తిడిలో ఉన్నాయని నిరాధార ఆరోపణలు చేశారు. దీనిపై తమ ప్రభుత్వం ఆందోళన చెందుతోందని ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇలాంటి అంశాలను తాము క్రమం తప్పకుండా భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

డచ్ ప్రధాని వ్యాఖ్యలకు భారత్ తన ప్రజాస్వామ్య బలాన్ని తెలియజేసేలా గణాంకాలతో కూడిన కౌంటరిచ్చింది. భారత్ 140 కోట్ల జనాభాతో, 5,000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన గొప్ప వైవిధ్యభరితమైన దేశమని జార్జ్ గుర్తుచేశారు. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు ఇక్కడే పుట్టాయని తెలిపారు. అన్ని మతాలు శతాబ్దాలుగా వర్ధిల్లుతున్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు పాల్గొనడమే భారత ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలో మైనారిటీల జనాభా 11 శాతంగా ఉంటే ప్రస్తుతం అది 20 శాతానికి పైగా చేరిందని ఇది మన సమ్మిళితత్వానికి నిదర్శనమని జార్జ్‌ కౌంటర్ ఇచ్చారు. అయితే, మోదీతో భేటీ అనంతరం డచ్ ప్రధాని జెట్టన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఇరు దేశాలూ ప్రజాస్వామ్యానికి, సుపరిపాలనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాయని పేర్కొనడం గమనార్హం.

Rob Jetten
Dutch Prime Minister
India
Press Freedom
Minority Rights
CBI George
Narendra Modi
Netherlands
Indian Democracy

More Telugu News