‘నేను ఇరుక్కుపోయాను.. నువ్వు చిక్కుకోవద్దు’.. స్నేహితురాలికి మాజీ మిస్ పూణె చివరి సందేశం!

Twisha Sharma Former Miss Pune Death Sparks Controversy
  • భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి
  • ఇది ఆత్మహత్య కాదు హత్యేనంటూ సీఎం ఇంటి వద్ద కుటుంబం ఆందోళన
  • నిజం తేలేవరకు అంత్యక్రియలు చేసేది లేదన్న తల్లిదండ్రులు
  • ఢిల్లీ ఎయిమ్స్‌లో రీపోస్టుమార్టం చేయాలని డిమాండ్
"నేను ఇరుక్కుపోయాను.. నువ్వు మాత్రం ఇందులో చిక్కుకోవద్దు".. ఇది భోపాల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణె త్వీషా శర్మ తన స్నేహితురాలికి పంపిన చివరి సందేశం. ఈ మెసేజ్ పంపిన మరుసటి రోజే.. రెండు నెలల గర్భిణి అయిన త్వీషా (31) తన అత్తారింట్లో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటన ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఇది ఆత్మహత్య కాదు, పక్కా హత్యేనని ఆరోపిస్తున్న త్వీషా కుటుంబ సభ్యులు.. న్యాయం చేయాలంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసం వెలుపల నిరసనకు దిగారు. తమ కుమార్తె మృతి వెనుక ఉన్న నిజం తేలేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. మృతదేహానికి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

త్వీషా భర్త, అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారని కుటుంబం ఆరోపిస్తోంది. నిందితుల కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉండటంతో పాటు, వారికి సమీప బంధువైన వ్యక్తి లోకాయుక్తగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తున్నారని తండ్రి నవనిధి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.

నోయిడాకు చెందిన త్వీషా, భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌ను 2025 డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. పెళ్లయిన కొన్ని రోజుల నుంచే వేధింపులు మొదలయ్యాయని, తిరిగి నోయిడా వచ్చేయాలని ఆమె భావించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వీషా భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్‌ను సవాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం త్వీషా కుటుంబం సీఎం ఇంటి వద్ద నిరసన కొనసాగిస్తుండగా, నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Go Back to Shorts
Twisha Sharma
Miss Pune
Bhopal
Suicide
Dowry Harassment
Murder
Madhya Pradesh
Samarth Singh
Nava Nidhi Sharma
Special Investigation Team

More Telugu News