కేరళ కొత్త సీఎం సతీశన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం!
- కేరళ కొత్త సీఎంగా సతీశన్
- రాహుల్ కు సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ కు నిరాశ
- మిత్ర పక్షాల ఒత్తిడితో సతీశన్ వైపు మొగ్గు
కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై వారం రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ అధిష్ఠానం గురువారం నాడు వీడీ సతీశన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పరిశీలకులైన అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, దీపా దాస్మున్షీ ఈ మేరకు ప్రకటన చేశారు. వాస్తవానికి మెజారిటీ ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపినప్పటికీ... పార్టీ కార్యకర్తలు, కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్) సతీశన్కు మద్దతు తెలపడంతో ఆయనకే సీఎం పీఠం దక్కింది.
ఈ ఎంపిక ప్రక్రియలో తెరవెనుక జరిగిన పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ తన అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకున్నారు. అయితే, పార్టీ యంత్రాంగం, మిత్రపక్షాల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి వల్ల సతీశన్ వైపు మొగ్గు చూపక తప్పలేదు.
ఈ వారం ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో మొత్తం తొమ్మిది మంది సభ్యులలో ఆరుగురు వేణుగోపాల్కే మద్దతు పలికారు. కేవలం కే. మురళీధరన్, వీఎం సుధీరన్ మాత్రమే ప్రారంభంలో సతీశన్ పేరును ప్రతిపాదించగా, మరొక నేత తటస్థంగా ఉండిపోయారు. సంఖ్యాబలం పరంగా వేణుగోపాల్కు అనుకూలంగా ఉన్నప్పటికీ, పార్టీ శ్రేణుల్లో సంతృప్తిని నింపడానికి మరియు కూటమిలో ఐక్యతను కాపాడటానికి అధిష్ఠానం చివరకు సతీశన్ను ఎంచుకోవాల్సి వచ్చింది.
ఎవరీ వీడీ సతీశన్?
వృత్తిరీత్యా న్యాయవాది అయిన వీడీ సతీశన్, కేరళ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. 2001 నుంచి ఎర్నాకులం జిల్లాలోని పరవూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, గత ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. విద్యార్థి దశలోనే ఎన్ఎస్ యూఐ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన, 2021 నుండి 2026 వరకు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా తన వాగ్ధాటిని వినిపించారు. రాజకీయాల్లోకి రాకముందు కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి 102 స్థానాల్లో అఖండ విజయం సాధించడంలో సతీశన్ పాత్ర కీలకం. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 63 స్థానాలను గెలుచుకుని తన బలాన్ని నిరూపించుకుంది.