శర్వానంద్ సరసన ఛాన్స్ కొట్టేసిన మానస వారణాసి!
- శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా
- టైమ్ ట్రావెల్ ఫిక్షన్ కథాంశం
- మానసను ఖరారు చేసినట్టు సమాచారం
టాలీవుడ్ స్టార్ శర్వానంద్, వరుస హిట్లతో దూసుకుపోతూ తన మార్కెట్ను పెంచుకుంటున్నారు. తాజాగా ఆయన సీనియర్ దర్శకుడు శ్రీనువైట్లతో చేతులు కలపడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. శ్రీనువైట్ల అంటేనే మనకు గుర్తొచ్చేది కడుపుబ్బ నవ్వించే వినోదం. అయితే ఈసారి ఆయన కేవలం కామెడీకే పరిమితం కాకుండా, దానికి 'టైమ్ ట్రావెల్' అనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ను జోడిస్తున్నారు. శర్వానంద్ టైమింగ్కు, శ్రీనువైట్ల మార్క్ హ్యూమర్కు తోడు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త మేజిక్ జరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జులైలో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడినట్లు కనిపిస్తోంది. మొదట స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, చివరకు మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసిని ఖరారు చేసినట్లు సమాచారం. 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాతో నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మానసకు, శర్వానంద్ పక్కన ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఈ కొత్త జోడీ వెండితెరపై ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీల్ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.