తలైవా సింప్లిసిటీకి ఫిదా అయిన నారా లోకేశ్: రజనీకాంత్ 'ఈగో' స్టోరీపై ఆసక్తికర ట్వీట్!
- ఆశ్రమంలో ఉన్నవారు తనను కన్నెత్తి కూడా చూడలేదన్న రజనీ
- స్టార్ డమ్ కంటే, ఆధ్యాత్మిక స్టార్ డమ్ గొప్పదనే విషయం నాకు అప్పుడు అర్థమైందని వెల్లడి
- స్టార్ డమ్ ను తలకెక్కించుకోకుండా వినయంగా ఉండటాన్ని మీ నుంచి నేర్చుకోవాలన్న లోకేశ్
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవం, శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్, తనలోని అహంకారం ఎలా తగ్గిందో వివరిస్తూ చెప్పిన విషయం అందరినీ ఆకట్టుకుంది. గతంలో తాను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, అక్కడి వారు తనను గుర్తుపట్టి మీద పడతారని ఊహించానని... కానీ ఎవరూ తన వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆయన నవ్వుతూ చెప్పారు. స్టార్ డమ్ కంటే, ఆధ్యాత్మిక స్టార్ డమ్ గొప్పదనే విషయం నాకు అప్పుడు అర్థమయిందని తెలిపారు. ఆ క్షణంలోనే తనలోని అహం అంతరించిపోయిందని చెప్పారు. కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ, తన గురించి తాను ఇంత సరదాగా, నిజాయితీగా చెప్పుకోవడం రజనీ హుందాతనాన్ని చాటిచెప్పింది.
ఈ ప్రసంగాన్ని విన్న మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ రజనీకాంత్పై ప్రశంసలు కురిపించారు. "అంతటి సూపర్ స్టార్డమ్ ఉన్నప్పటికీ, దానిని తలకు ఎక్కించుకోకుండా వినయంగా ఉండటం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి" అని లోకేశ్ పేర్కొన్నారు. విజయం సాధించడమే కాకుండా, ఆ విజయంలో కూడా ఎలా ఒదిగి ఉండాలో చెప్పే మీ మాటలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. రజనీకాంత్ ప్రసంగంలోని లోతు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని లోకేశ్ తన ట్వీట్లో వెల్లడించారు