పుష్ప లాంటి సినిమాను ఇతర రాష్ట్రాల్లో ఆ విధానంలోనే ప్రదర్శించారు: హీరోలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి

  • హీరోలకు, నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి
  • ఇతర రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్‌లలో పర్సంటేజీ షేరింగ్ విధానంలో ప్రదర్శించినట్లు వెల్లడి 
  • పర్సంటెజీ విధానంతో మల్టీప్లెక్సులు ప్రయోజనం పొందుతున్నట్లు వెల్లడి
  • కొవిడ్‌కు ముందున్న రెంటల్ విధానాన్ని కొనసాగించడం భారంగా మారిందని వెల్లడి
'పుష్ప' లాంటి సూపర్ హిట్ సినిమాలను ఇతర రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్‌లలో పర్సంటేజీ షేరింగ్ విధానంలో ప్రదర్శించారని, కానీ తెలుగు రాష్ట్రాలలో ఆ అవకాశం దక్కడం లేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు ప్రముఖ హీరోలు, నిర్మాతలను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండస్ట్రీ బాగుపడాలంటే పర్సంటేజీ షేరింగ్ విధానంలో సింగిల్ స్క్రీన్లు రన్ చేయడం తప్పనిసరి అని తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ల మనుగడకు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతల మద్దతును తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కోరింది. తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆ ప్రకటనలో వివరించింది. రెంట్/పర్సెంటేజీ సిస్టం సింగిల్ స్క్రీన్లకు ఇకపై ఆచరణ యోగ్యం కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్లను కాపాడేందుకు పూర్తిస్థాయి పర్సంటేజీ షేరింగ్ విధానం అవసరమని తెలిపింది.

ప్రస్తుతం సినిమాలు ఎక్కువ రోజులు ప్రదర్శితం కావడం లేదని, ఎఫ్-2 లాంటి కొన్ని సినిమాలు 8 వారాల పాటు ప్రదర్శితమయ్యాయని గుర్తు చేసింది. ధురంధర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా థియేటర్లలో తక్కువ వారాలే ఆడిందని తెలిపింది. మారుతున్న కాలాన్ని బట్టి ప్రేక్షకులలో కూడా మార్పు వచ్చిందని వెల్లడించింది.

పర్సెంటేజీ విధానంతో మల్టీప్లెక్స్‌లు ఇప్పటికే ప్రయోజనం పొందాయని తెలిపింది. పుష్పలాంటి హిట్ చిత్రాలను ఇతర రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్‌లలో పర్సంటేజీ షేరింగ్ విధానంలోనే ప్రదర్శించినట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్‌లకు ఈ అవకాశం దక్కకపోవడం అసమానత అవుతుందని పేర్కొంది. కొవిడ్‌కు ముందున్న రెంటల్ విధానాన్ని నిర్మాతలు కొనసాగించడం ప్రస్తుతం భారంగా మారిందని పేర్కొంది. పర్సంటేజీ విధానం కొనసాగించడం పరిశ్రమకు అవసరమని ఆ ప్రకటనలో పేర్కొంది. రిస్క్, రివార్డులను సమానంగా పంచుకోవాలని కోరింది.

Pushpa Movie
Telangana Exhibitors
Single Screens
Percentage Sharing
Tollywood
Movie Theaters

More Telugu News