రేపు అనంతపురం జిల్లాకు వెళ్లనున్న జగన్
- పామిడిలో ఒక వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరుకానున్న జగన్
- అనంతరం తాడేపల్లికి బయల్దేరనున్న వైసీపీ అధినేత
- జగన్ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ శ్రేణులు
వైసీపీ అధినేత జగన్ రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. యూరప్ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన తర్వాత ఆయన చేపడుతున్న మొదటి జిల్లా పర్యటన ఇదే కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
రేపు మధ్యాహ్నం ఆయన అనంతపురం జిల్లాలోని పామిడికి చేరుకుంటారు. ఎమ్మెల్సీ మధుసూదన్ కుమారుడు చైతన్య మిత్ర, వైసీపీ నేత పామిడి వీరా కుమార్తె, ఏడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్పర్సన్ లిఖితల వివాహ రిసెప్షన్ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. గుంతకల్లు నియోజకవర్గం పరిధిలోని పామిడిలో నిర్వహించనున్న ఈ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను జగన్ ఆశీర్వదించనున్నారు.
జగన్ రాకను పురస్కరించుకుని పామిడిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పార్టీ కీలక నేతలందరూ ఈ వేడుకకు తరలివచ్చే అవకాశం ఉంది. భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన తాడేపల్లికి బయల్దేరుతారు.