ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ను ఆహ్వానించాలన్న చిదంబరం
- గవర్నర్ తన రాజ్యాంగ కర్తవ్యాన్ని నిర్వహించాలన్న చిదంబరం
- అత్యధిక స్థానాలు గెలుచుకున్న నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హితవు
- సంఖ్యాబలాన్ని తేల్చాల్సింది రాజ్ భవన్ వేదికగా కాదని హితవు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో, గవర్నర్ తన రాజ్యాంగ కర్తవ్యాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం, ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మొదట ఆహ్వానించాలని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయ నియమం మాత్రమే కాదని, భారత ప్రజాస్వామ్యంలో నెలకొన్న బలమైన సంప్రదాయమని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉందో లేదో తేల్చాల్సింది రాజ్భవన్ వేదికగా కాదని, శాసనసభలోనే అని చిదంబరం నొక్కి చెప్పారు. అత్యధిక స్థానాలు పొందిన పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి, ఆపై అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాలని ఆదేశించడమే సరైన పద్ధతి అని హితవు పలికారు. ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పులను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.