Advertisement

డీఎంకే, తృణమూల్ ఓటమి... ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు అఖిలేష్ ప్రకటన

Akhilesh Yadav Ends Ties With IPAC After DMK TMC Losses
  • డీఎంకే, తృణమూల్ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో పనిచేసిన ఐ-ప్యాక్
  • నిధుల కొరత కారణంగా ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు వెల్లడి
  • డీఎంకే, తృణమూల్ ఓటమి నేపథ్యంలో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు ప్రచారం
  • ఈ ప్రచారాన్ని ఖండించిన అఖిలేష్ యాదవ్
తమిళనాడులో డీఎంకే కూటమి, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూశాయి. ఈ రెండు పార్టీలకు ఐ-ప్యాక్ పనిచేసింది. అయితే ఈ ఓటమి తర్వాత రెండు రోజులకే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇందుకు నిధుల కొరత కారణమని ఆయన తెలిపారు.

వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐ-ప్యాక్‌తో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకున్నామని అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ఐ-ప్యాక్ టీమ్ తమతో కొన్ని నెలలు పని చేసిందని, కానీ నిధుల కొరత కారణంగా దానిని కొనసాగించలేకపోతున్నామని వెల్లడించారు.

బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే ఓటమి నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

ఐప్యాక్ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. "మా వద్ద నిధులు లేవు. మీరు (మీడియా) మాకు నిధులు ఇస్తే మరో కంపెనీని ఎన్నికల కోసం నియమించుకుంటాం" అని అఖిలేష్ సరదాగా అన్నారు. కానీ, ఐప్యాక్ పని చేసిన రెండు పార్టీలు ఓడిపోయిన అనంతరం అఖిలేష్ యాదవ్ నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల తీరును అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. దీనిని సుప్రీంకోర్టు వెంటనే సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఓట్ల లెక్కింపు వీడియో రికార్డింగును ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. బెంగాల్‌లో చోటు చేసుకున్న పరిణామాలు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement
Akhilesh Yadav
Samajwadi Party
I-PAC
Prashant Kishor
Uttar Pradesh Elections
DMK loss
TMC loss

More Telugu News