విజయ్ కి అభినందనలు తెలిపిన నిత్యానందస్వామి శిష్యురాలు రంజిత
- విజయ్ కు కైలాస దేశం నుంచి అభినందనలు తెలిపిన రంజిత
- కొత్త ప్రభుత్వానికి, తమిళ ప్రజలకు స్వామీజీ ఆశీస్సులు ఉంటాయని వెల్లడి
- తమిళ ప్రజలు సాహసోపేతమైన తీర్పును ఇచ్చారని కితాబు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా విజయ్ పగ్గాలను చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో, విజయ్ కు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్థాపించిన 'కైలాస' దేశం నుండి అనూహ్య స్పందన లభించింది. నిత్యానంద ముఖ్య శిష్యురాలు, ఒకప్పటి సినీ నటి రంజిత (ప్రస్తుతం మా నిత్యానందమయి) విజయ్కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. చాలా కాలంగా వార్తలకు దూరంగా ఉన్న రంజిత, ఇప్పుడు కైలాసం దేశ ప్రధానమంత్రి హోదాలో ఒక్కసారిగా తెరపైకి రావడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిత్యానంద స్వామి తరపున అభినందనలు తెలుపుతూ రంజిత చేసిన ట్వీట్లో... విజయ్ సారథ్యంలో కొలువుదీరబోయే నూతన ప్రభుత్వానికి, తమిళనాడు ప్రజలకు స్వామీజీ దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. తమిళ ప్రజలు అత్యంత సాహసోపేతమైన, స్పష్టమైన తీర్పును ఇచ్చారని ఆమె కొనియాడారు. నిత్యానంద శిష్యురాలిగా మారి ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగుతున్న రంజిత, ప్రస్తుతం కైలాసం దేశ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.