అమెరికాలో ఎంపీ శ్రీభరత్.. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేలా కీలక సమావేశం

  • విశాఖలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసాంధ్రులకు ఎంపీ శ్రీభరత్ పిలుపు
  • రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని వెల్లడి
  • పరిశ్రమలకు దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్న ఎంపీ
  • మంత్రి లోకేష్ చొరవతో దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయని వివరణ
  • జులై మొదటి వారంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్ ఇంజన్‌గా ఎదుగుతున్న విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విశాఖ ఎంపీ ముతుకుమిల్లి శ్రీభరత్ ప్రవాసాంధ్రులకు (ఎన్ఆర్ఐ) పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఆయన, కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలను ఉద్దేశించి శ్రీభరత్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం దిశగా పరుగులు పెడుతోందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అనే వినూత్న విధానాన్ని అమలు చేస్తోందని గుర్తుచేశారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అనుమతులను వేగంగా మంజూరు చేయడంతో పాటు, దేశంలోనే మరే రాష్ట్రం అందించనటువంటి అత్యుత్తమ ప్రోత్సాహకాలను ఏపీ అందిస్తోందని వివరించారు. ఈ సానుకూల వాతావరణం ఫలితంగానే ప్రస్తుతం దేశంలోకి వస్తున్న మొత్తం విదేశీ, స్వదేశీ పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతానికి పైగా వాటాను ఏపీ దక్కించుకుంటోందని గణాంకాలతో సహా తెలిపారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో గ్లోబల్ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయని శ్రీభరత్ పేర్కొన్నారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, తద్వారా వేలాది ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అదేవిధంగా, టెక్ దిగ్గజం గూగుల్, ఉక్కు తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఆర్సెలర్ మిట్టల్ వంటివి కూడా తమ ప్రాజెక్టుల పనులను ఇప్పటికే ప్రారంభించాయని వెల్లడించారు. 

మరోవైపు, ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చబోయే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చివరి దశకు చేరుకుందని, జులై మొదటి వారంలోనే దీనిని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కీలక ప్రాజెక్టులతో విశాఖ ప్రాంతం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోందని, కాబట్టి ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సువర్ణావకాశమని ఆయన ఉద్ఘాటించారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని వసతులు విశాఖలో ఉన్నాయని, పెట్టుబడులతో ముందుకువచ్చే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఏ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు వెంకట్ కోగంటి, శ్రీకాంత్ దొడ్డపనేని, భక్త భల్లా, సుధీర్ ఉన్నం, హరి సన్నిధి, విజయ్ ఆసూరి, శశి దొప్పలపూడి తదితరులు పాల్గొన్నారు.

Sri Bharat
Vizag
Visakhapatnam
Andhra Pradesh Investments
AP NRI
Nara Lokesh
Chandrababu Naidu
Bhogapuram Airport
Komatireddy Jayaram
AP Economy

More Telugu News